భారత్ లో చాలా మంది దగ్గర విలువైన కార్లు, హెలికాఫ్టర్లు, విమానాలు, షిప్ లు ఉన్నాయి. కానీ, సొంత రైలు అనేది ఎవరీ దగ్గరా ఉండదు. కానీ, ఓ రైతు రైలుకు యజమాని అయ్యాడు. దేశంలో రైళ్లను భారతీయ రైల్వే సంస్థ నడిపిస్తుంది కదా? రైతు రైలును ఎలా కొనుగోలు చేశాడు? అని ఆశ్చర్యపోతున్నారా? అయినా, ఇది నూటికి నూరు శాతం నిజం. రైల్వే అధికారులు చేసిన ఓవరాక్షన్ కారణంగా ఓ రైతు స్వర్ణ శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలుకు యజమాని అయ్యాడు. భారతీయ రైల్వే చరిత్రలోనే ఇదో అరుదైన ఘటనగా మిగిలిపోయింది.
పంజాబ్ లోని లూథియానాకు చెందిన ఓరైతు రైలుకు ఓనర్ అయ్యాడు. 2007వ సంవత్సరంలో లూథియానా- చండీగఢ్ రైల్వే లైన్ నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. భూసేకరణ చేపట్టారు. కటానా అనే గ్రామంలో రైల్వే లైన్ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి రూ. 25 లక్షల చొప్పున పరిహారం అందించారు. మరికొద్ది నెలల్లోనే పక్క గ్రామంలో ఎకరానికి ఏకంగా రూ. 71 లక్షలు నష్టపరిహారం అందించారు. ఈ విషయం కటానా గ్రామంలోని సంపూరణ్ సింగ్ కు తెలిసింది. తను కూడా రైల్వే లైన్ కోస భూమిని ఇచ్చాడు. వెంటనే తను న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమకు రూ. 25 లక్షలు పరిహారం ఇచ్చి, పక్క గ్రామంలో రూ. 71 లక్షలు ఇచ్చారని కోర్టుకు తెలిపారు. తమకు కూడా అదే మాదిరిగా నష్ట పరిహారం ఇప్పించాలని కోరారు.
సంపూరణ్ సింగ్ న్యాయస్థానంలో పోరాటం ముమ్మరం చేశారు. రైల్వే శాఖ అతడితో చర్చలు జరిపింది. ఎకరాకు రూ. 50 లక్షలు ఇస్తామని చెప్పింది. అయినా ఆయన ససేమిరా అన్నారు. సంపూరణ్ సింగ్ కు ఇవ్వాల్సిన పరిహారం రూ. కోటిన్నరకు పెరిగింది. ఈ మొత్తాన్ని నార్తన్ రైల్వే 2015 లోగా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. అయినప్పటికీ ఆయనకు పూర్తి స్థాయిలో నష్ట పరిహారం అందించలేదు. 2017 వరకు కేవలం రూ. 42 లక్షలు మాత్రమే చెల్లించింది.
2017లో సంపూరణ్ సింగ్ మరోసారి న్యాస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ తనకు రావాల్సిన నష్ట పరిహారం అందించలేదన్నారు. దీనిపై న్యాయస్థానం మరోసారి విచారణ జరిపింది. అనంతరం డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి జస్పాల్ వర్మ సంచలన తీర్పు ఇచ్చారు. ఢిల్లీ-అమృత్ సర్ స్వర్ణ శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలుతో పాటు లూథియానాలోని స్టేషన్ మాస్టర్ కార్యాలయాన్ని జప్తు చేయాలని జడ్జి ఆదేశించారు. పరిహారం కింద వాటిని సంపూరణ్ సింగ్ కు అందివ్వాలని తీర్పు చెప్పారు. ఈ తీర్పుతో సంపూరణ్ సింగ్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ కు ఓనర్ అయ్యారు. అంతేకాదు, దేశంలో సొంత రైలు ఉన్న ఏకైక వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత రైల్వేశాఖ పరిహరాన్ని అందించేందుకు ఒప్పుకోవడంతో న్యాయస్థానం తన ఆదేశాలను వెనక్కి తీసుకుంది. అయినప్పటికీ రైలుకు యజమాని అయిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.