మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆయుర్వేద ఔషధాల్లో త్రికటు చూర్ణం ఒకటి. శొంఠి, పిప్పళ్లు, మిరియాలను చూర్ణం చేసి సమపాళ్లలో కలిపి త్రికటు చూర్ణాన్ని తయారు చేస్తారు. ఈ చూర్ణంతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అనేక వ్యాధులు తగ్గుతాయి. దీన్ని ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఇంట్లో ఉంచుకోవాలి. దీంతో ఏమేం అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
1. త్రికటు చూర్ణం మూడు భాగాలు, ఒక భాగం వాము, యాలకులు, ఉప్పు, నేతిలో వేయించిన ఇంగువ చూర్ణం తీసుకుని అన్నింటినీ కలపాలి. అందులో కాసీ భస్మం కలపాలి. తగినంత నిమ్మరసం పోసి ఎండలో ఎండబెట్టాలి. తరువాత చూర్ణం చేసి ఉదయం, సాయంత్రం ఒక టీస్పూన్ చొప్పున సేవించాలి. కడుపునొప్పి, అగ్ని మాంద్యం, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.
2. త్రికటు చూర్ణం, త్రిఫల చూర్ణం, తగినంత సైంధవ లవణం కలిపి రోజుకు రెండు సార్లు అరటీస్పూన్ చొప్పున తీసుకోవాలి. పొడిదగ్గు, కళ్లె దగ్గు, జలుబు తగ్గుతాయి.
3. త్రికటు చూర్ణం మూడు భాగాలు, వాము, సైంధవ లవణం, జీలకర్ర, నేతిలో వేయించిన ఇంగువ చూర్ణాలను ఒక్కొక్క భాగం వంతున కలిపి భోజనం మొదటి ముద్దలో కలిపి తింటుండాలి. కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, త్రేన్పులు, విరేచనాలు తగ్గుతాయి.
4. రోజుకు ఒకసారి అరగ్లాస్ వేడి నీటిలో ముప్పాతిక స్పూన్ త్రికటు చూర్ణం, పావు స్పూన్ జీలకర్ర చూర్ణం, ఒక టీస్పూన్ ఉప్పు కలిపి తగినంత నిమ్మరసం కలిపి తాగుతుంటే కడుపు నొప్పి, నడుం నొప్పి, ఒళ్లు నొప్పులు, మలబద్దకం, అగ్ని మాంద్యం, అజీర్ణం, అరుచి, వికారం వంటి సమస్యలు తగ్గుతాయి.
5. రెండు గరువింద గింజల ఎత్తు త్రికటు చూర్ణాన్ని పరిశుభ్రమైన నీటిలో కలిపి వడగట్టి నాలుగైదు చుక్కల వంతున ముక్కు రంధ్రాల్లో వేసుకుంటుంటే జలుబు, ముక్కు దిబ్బడ, తలబరువు, సైనస్, కంటి సమస్యలు తగ్గుతాయి.
6. ఒక భాగం జాజికాయ, లవంగాల చూర్ణాలను, మూడు భాగాల త్రికటుచూర్ణం, త్రిఫల చూర్ణాలకు కలిపి ఇందులో శుద్ధ లోహ భస్మాన్ని తొమ్మిది భాగాలు కలిపి ఉంచుకుని, ఐదారు చిటికెల వంతున రోజుకు రెండు సార్లు తేనెతో కలిపి తీసుకుంటే రక్తవృద్ధి జరుగుతుంది.