ఆధ్యాత్మికం

ఈ ఆల‌యంలో 9 ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తే చాలు.. అనుకున్న‌వి నెర‌వేరుతాయి..!

కడప-రేణిగుంట జాతీయ రహదారిలో జిల్లా కేంద్రమైన కడపకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందలూరులో సౌమ్యనాథాలయం ఉంది. ఈ గ్రామంలో వెలసిన సౌమ్యనాథాలయంలో సౌమ్యనాథస్వామి మూలవిరాట్‌ను ప్రతిష్టించారని శాసనాలు ధ్రువీకరిస్తున్నాయి. ఈ సౌమ్యనాథాలయం ఎంతో పురాతనమైనది.. దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధ ఆలయంగా పేరుగాంచింది. విశాలమైన, సుందర మనోహర క్షేత్రం.. శిల్ప సౌందర్య సోయగం.. స్వామి భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న క్షేత్రం. దక్షిణ భారతదేశంలో ఉన్న సుప్రసిద్ధ ఆలయాల్లో ఈ సౌమ్యనాథాలయం ఒకటి. శ్రీ సౌమ్యనాథునికి చొక్కనాథుడని, చొక్కనాథ పెరుమాళ్ అని, కులోత్తుంగచోళ ఎంబరుమన్నార్ విన్నగర్ అనే పేర్లు గలవు. సౌమ్యనాథుడన్నా.. చొక్కనాథుడన్నా సౌందర్యవంతుడని అర్థం. సౌమ్యనాథుడనగా సౌమ్యకు(శ్రీలక్ష్మీదేవికి) నాథుడని అర్థం. స్వామి మూలవిరాట్ ఏడడుగుల ఎత్తు ఉండి చాలా సౌమ్యంగా అభయముద్రాలంకితమై ఉంటుంది.

ఎటువంటి దీపం లేకున్నా సౌమ్యనాథస్వామి ఉదయం నుంచి సాయంకాలం వరకు దేదీప్యమానంగా వెలుగొందే విధంగా ఆలయం నిర్మించడం అద్భుతం. గర్భగుడి ప్రధాన ద్వారానికి వంద గజాల దూరం నుంచి కూడా స్వామి చాలా స్పష్టంగా కనిపిస్తారు. ఏడాదిలో ఏదో ఒక రోజు సూర్యకిరణాలు స్వామి పాదాలపై ప్రసరించే విధంగా శిల్పులు నిర్మించారు. ఆలయంలో లోపలికి ప్రవేశించగానే రాతి మంటపంపై నుంచి గర్భాలయంలో ప్రవేశించాల్సి ఉంది. ఈ మంటపం ముందు భాగం శిఖరంలో సింహం తల ఆకారంలో ఇరువైపులా ఉన్నాయి. ఏ దేవాలయానికి అయినా ఆలయ పైభాగంలో సింహం తలలు అమర్చిబడివుంటాయి. కానీ సౌమ్యనాథస్వామి ఆలయంలో లోపలి మంటపంలోని ఓ భాగమంతా సింహం తలలతో నిండి ఉండటం కనిపిస్తుంది. కాబట్టి ఆలయ పైభాగంలో ఉండే ఈ సింహం తలలు ఆలయ లోపల ఉండటం వల్ల.. భూగర్భంలో మరో ఆలయం ఉన్నట్లుగా గోచరిస్తోంది. రాతి మంటపం అడుగున ఉన్న శివాలయంగా చెప్పుకుంటున్నారు.

do you know these things about soumyanatha temple

ఆలయ కుడ్యాలపై (లోపల)పై భాగంలో మత్స్య, సింహం చిహ్నాలు ఉన్నాయి. మత్స్య ఆకారాన్ని మలిచి ఉన్నారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున వరదలు వచ్చి ఆలయాన్ని ముంచెత్తినప్పుడు.. ఆలయానికి పైభాగంలో ఉండే మత్స్యకు ప్రాణం వచ్చి వరదలలో కలిసిపోతుందని స్థానికుల నమ్మకం. అంటే అప్పటికి కలియుగం అంతమైపోతుందనే అర్థం వస్తుందని చెబుతుంటారు. 11వ శతాబ్దంలో చోళవంశరాజు కుళోత్తుంగచోళుడు శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చోళ, పాండ్య, కాకతీయ, విజయనగరాజులచే 17వ శతాబ్దం వరకు ఆలయ నిర్మాణం కొనసాగింది. పతిరాజుల‌ కాలంలో ఆలయం ప్రసిద్ధి చెందింది. 12వ శతాబ్దంలో కాకతీయప్రతాపరుద్రుడు రాజగోపురం కట్టించారు. ఆలయాన్ని దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో 180 స్తంభాలతో వైఖానస, వైష్ణవగామ ఆర్షపోక్త వాస్తుయుక్తముగా సువిశాలంగా నిర్మించారు. ఈ దేవాలయానికి 120 ఎకరాల మాన్యం ఉన్నట్లు శాసనాలలో ఉంది. సింహద్వారంలో గాలిగోపురం ఉత్తరగోపురం, దక్షిణగోపురం ద్వారాలు ఉన్నాయి.

ఆలయంలో రాతిదీపస్తంభం, బలిపీఠం, ధ్వజస్తంభం, గరుడమందిర, మత్స్యమంటపం, ఆంజనేయ మంటపం, చిన్నకోనేరు, జయవిజయాలు, అంకుర్పారణ మంటపం, వంటశాల, శ్రీ యోగనరసింహస్వామి, శిల్పకళ, అంతరాళం ఉన్నాయి. దేవాలయ ఆవరణలో పెద్ద కోనేరు ఉంది. ప్రసిద్ధ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్య జన్మస్థలమైన తాళ్లపాక గ్రామం నందలూరుకు సమీపంలో ఉన్నందున.. అన్నమాచార్యులు సౌమ్యనాథాలయాన్ని దర్శించుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి. స్వామిపై అన్నమయ్య శృంగార కీర్తనలు రచించారు. ఈ దేవాలయంలోని గర్భగుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే కోర్కెలు నెరవేరుతాయనే విశ్వాసం భక్తుల్లో ప్రగాఢంగా ఉంది. కోర్కెలు తీరిన తర్వాత గర్భగుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయడం క్షేత్ర సంప్రదాయంగా వస్తోంది. సంతానం కలగని వారు స్వామిని ప్రార్థిస్తే కలుగుతుందని భక్తులు నమ్ముతున్నారు. కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా సౌమ్యనాథస్వామి ప్రసిద్ధి చెందారు. మనసారా పూజించే వారికి భూత, ప్రేత, పిశాచాల బాధలు తొలిగిపోవడమే కాక చెడు కలలు రావడం ఉండవని చెబుతున్నారు.

Admin

Recent Posts