దత్తాత్రేయుడు నిరాకారుడు. దిక్కులనే అంబరములుగా చేసుకున్నవాడు. కేవలం భక్తునుద్ధరించేందుకే రూపాలను ధరించేవాడు. బాలకుడిగా వచ్చినా, ఉన్మత్తుడిగా ఉన్నా, కల్లుగీసే గౌడకులస్తుడిగా కనిపించినా, పిశాచరూపంలో ఉన్నా అవన్నీ భక్తులను ఉద్దరించడానికే! అటువంటి దత్తాత్రేయుల వారు పడుకున్న పాములాగ’శయన రూపంలో ఉన్న అత్యంత అరుదైన దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈ దేవాలయం దర్శిస్తే కలిగే లాభాలు, రూప విశిష్టత సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం.. వరదవెల్లి దత్తాత్రేయుని విగ్రహంలో దాగున్న పెనవేసుకున్న జంట సర్పములతో ఉంటుంది. అభివృద్దికి ఆమడదూరంలో ఉన్న ఒక కుగ్రామంలో, ప్రపంచంలోని ఏకైక రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయుడు నిఘూఢంగా ఉండటం.
వరదవెల్లి గ్రామం తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోగల బోయినపల్లి మండలంలో కరీంనగర్ వేములవాడ రోడ్లో కొదురుపాక స్టేజి వద్దగలదు. వరదవెల్లి గ్రామం మిడ్ మానేరు జలాశయం కింద రావడం వల్ల వరదవెల్లి గ్రామం మొత్తం దాదాపుగా నిర్వాసిత గ్రామమే. మిడ్ మానేరు జలాశయం పూర్తయితే ఈ అరుదైన దత్తక్షేత్రంతో పాటు ఊరు కుడా ఉండకపోవచ్చు. పూర్వం నుండి తరచుగా ఈ గ్రామం ముంపుకు, వరదలకు గురౌతుండం వల్ల వరదవెల్లి అని పేరు వచ్చిందని కొంత మంది గ్రామస్తుల అభిప్రాయం. అయితే గురు దత్తాత్రేయుల వారు వరద హస్తములతో ఇక్కడ వెలియడం వల్ల వరదవెల్లి’అనే పేరొచ్చిందన్నది చారిత్రాత్మక కథనం. అత్యంత అరుదైన రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయుడు ఉండడం ఈ గ్రామ ప్రత్యేకత. ఇటు వంటి క్షేత్రం ప్రపంచంలో మరెక్కడాలేదు. ఈ దత్తక్షేత్రం ప్రాంగణంలోనే దత్తాత్రేయుడు వేంకటేశ్వర స్వామి రూపంలో దత్త వేంకటేశ్వర స్వామి గా కుడా వెలిశారు. దత్త వేంకటేశ్వర స్వామి గుడి కుడా ప్రపంచంలో ఇదొక్కటే.
వరదవెల్లి గ్రామం చారిత్రాత్మకంగా ప్రసిద్ధికెక్కిన గ్రామం. నీటి నిల్వలు అధికంగా ఉండి బాగా పంటలు పండే ప్రదేశం. అప్పట్లో గుట్ట మీదగల శయన దత్తాత్రేయుడు, దత్త వేంకటేశ్వర స్వామిని దర్శించిన తర్వాతే వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించేవారట. కాలక్రమేణా ఈ ఆచారం మరుగున పడిపోయింది. దాదాపు 900 సంవత్సరాల క్రితం దేశాటనలో భాగంగా శ్రీవేంకటాచార్యులు అనే ఒక కుర్ర వైష్ణవ అవధూత (ఈయననే వెంకావధూత అనేవారు) వేములవాడకు వచ్చి అక్కడ నుండి వరదవెల్లికి వచ్చి అక్కడ గల గుట్ట మీద శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కోసం 12 సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేసారు. వెంకావధూత వేంకటేశ్వర స్వామి వారి భక్తుడే కాకుండా శ్రీ గురు దత్తాత్రేయుల వారి భక్తులు కుడా. వారి తపస్సుకు మెచ్చిన వేంకటేశ్వర స్వామి వెంకావధూత కోరిక మేరకు దత్తవెంకటేశ్వర స్వామిగా దర్శనమిచ్చారు.
దత్తవెంకటేశ్వర స్వామి దర్శనంతో పులకించిపోయిన వెంకావధూత తదుపరి కుడా అక్కడే ఉండి శ్రీ గురు దత్తాత్రేయుల వారి కోసం ఘోర తపస్సు చేసారు. ఆవిధంగా 28 సంవత్సరాలు దత్త దర్శనం కోసం నిరంతరం తపించారు. ఆఖరికి ఒకానొక గురువారం ఉదయం సూర్యోదయ సమయంలో శ్రీ దత్తాత్రేయుల వారు ఏఖముఖుడిగా ప్రత్యక్షమై వెంకావధూత భక్తి శ్రద్ధలకు మెచ్చి ఇలా ఆనతిచ్చారని ఇక్కడి పండితులు పేర్కొంటున్నారు. వారి ప్రకారం దత్తాత్రేయ స్వామి వెంకావధూతతో నీకు రాహు మహర్దశ జరుగుతుంది. ఆ కర్మను నువ్వు ఇంకా అనుభవించాలి కాబట్టి నేనే రాహురూపం లోకి మారి శయన సర్పరూపుడిగా ఆ పని చేస్తాను. నా త్రిముర్త్యాత్మకతకు చిహ్నంగా ఈ క్షేత్రం లో మూడు నింబవృక్షాలు కుడా ఆవిర్భవించి, అరుదైన దత్తక్షేత్రంగా కీర్తికెక్కుతుంది. ఇక్కడకి దర్శనానికి వచ్చే భక్తులను రాహువు రూపంలో ఉన్న నేను త్వరగా ఉద్ధరిస్తాను.
ఈ క్షేత్రం లో గల నా రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయ విగ్రహానికున్న వరద హస్తాలు భక్తులనెల్లవేళలా కాపాడతాయి.. అంటాడు. అంతట శ్రీ దత్తాత్రేయుల వారు రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయుడుగా మారి వెంకావధూత కర్మలను త్వరగా అనుభవించేట్టుగా చేసి వెంకావధూతను వారిలోకి ఐక్యం చేసుకుంటారు. ఆ విధంగా కేవలం భక్తులను ఉద్ధరించడానికి మరో రూపం లోకి మారి అత్యంత అరుదైన రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయుడు వరదవెల్లి దత్తాత్రేయుడుగా యేర్పడ్డాడు. ముందు చెప్పుకున్నట్లుగా రూపమే లేని గురు దత్తాత్రేయుడు ఇక్కడ చిత్రంగా ఉండి పూజలందుకుంటున్నారు. దత్తాత్రేయుడు పడుకుని రాహు రూపంలో ఉండడం, దత్తత్రేయునికి ప్రతీకగా నేటికి ఉన్న వందల ఏళ్ళనాటి నింబవృక్షాలు, వరదవెల్లి రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయుడిని ఫోటో తీసినప్పుడు విగ్రహం లో దాగిఉన్న జంట సర్పాల ఆనవాళ్ళు కనిపించడం, దత్తాత్రేయుడు వెంకటేశ్వర స్వామి రూపంలో దత్త వెంకటేశ్వరస్వామిగా పిలవబడడం, ఇటువంటి అతి అరుదైన క్షేత్రం త్వరలో నదీగర్భంలో కలియనుండడం, క్షేత్రానికి 3 వైపులా నీళ్లు ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకతలు.
ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే.. తొందరగా తెమలని కోర్ట్ కేసులు ఉన్నవారు, వయస్సు పెరిగినా ఉద్యోగంలో సెటిల్ అవ్వనివారు, రాహు మహర్దశలో ఉన్నవారు, భర్త ఒక చోట ఉద్యోగంలో భార్య,పిల్లలు మరొక చోట ఉన్నవారు లేదా భార్య ఒక చోట ఉద్యోగంలో భర్త, పిల్లలు మరొక చోట ఉన్నవారు, ఉద్యోగ బదిలీలు కావాలనుకునేవారు, ఆఫీస్ పాలిటిక్స్లో పైచేయి/విజయం సాధించాలనుకునే వారు, దొంగతనం మొదలైన అభాండాలు మీదపడ్డవారు, తరచుగా అబార్షన్లు/సంతన నష్టం కలిగినవారు దర్శిస్తే అనుకున్నవి నెరవేరుతాయి. వరదవెల్లి రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయుడిని దర్శించుకునే వారు అభిషేక సామగ్రిని, నల్ల వస్ర్తాన్నితీసుకెళ్ళాలి. అలాగే అక్కడ గల దత్త వెంకటేశ్వర స్వామి వారికి పూజా సామాగ్రి మీ శక్తి కొద్ది పట్టు వస్ర్తాన్ని తీసుకెళ్ళాలి.