కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చి సూపర్హిట్టయిన దేవి సినిమాలో పాముది ప్రాధాన పాత్ర. షూట్లో వాడేపాములన్నీ విషం తీసేసిన పాములే. నాగదేవత భక్తురాలైన వనిత(మంజుల కుమార్తె)పుట్టలో పాలుపోసి పాటపాడితే పామొచ్చి ఆమెకి బొట్టుపెట్టే సన్నివేశం చిత్రీకరణ జరుగుతుంది. సాధారణంగా అలాటిషాట్స్ తీసేటప్పుడు పాముకి మూతి కుట్టేస్తుంటారు. కానీ వనిత ధైర్యంగా నాకేం భయంలేదు పాముకి నోరు కుట్టొద్దు అనటంతో కుట్టలేదు. ఫ్రేం ఔట్లో వుండి పడగవిప్పివున్న పాముని పట్టుకున్న పామును క్లోజ్షాట్లో నమస్కారం పెడుతున్న వనిత నుదుటికి పాముని ఆనించాలి. అక్కడి వరకూ వచ్చిన పాము ఛక్ మని ఆమె వ్రేలుని గట్టిగా పట్టేసుకోవటంతో అందరూ షాక్.
ఒక నిమిషం తరువాత అది వొదిలేసినా రక్తం ధారగా కారిపోవటంతో కంగారుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. పాముకి విషం లేనందున, అమ్మాయి ధైర్యంగా ఉన్నందువల్లా ఏమీ కాలేదని ఇంజక్షన్స్ ఏవో చేసి పంపించటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మద్రాస్ లో తరతరాలుగా షూటింగ్స్కి కావలసిన పాములను తీసుకొచ్చేది భాయ్ కుటుంబమే. అతనితోపాటు అతని అసిస్టెంట్గా ఓ 19 ఏళ్ళ బక్కపలుచని కుర్రాడొచ్చేవాడు దేవి షూటింగ్కి. ఎంతో హుషారుగావుంటూ యూనిట్ అందరికీ ఇష్టుడైపోయాడు. వాడి అసలుపేరేంటో గానీ డైరెక్టర్గారు మణి అనిపిలుస్తూ వాడిమీద జోకులేస్తూవుండేవారు. ఓ షెడ్యూల్ వైజాగ్లో ప్లాన్ చేశాం. భాయ్ కి మరో షూటింగ్ ఉండటంతో ఆ షెడ్యూల్కి భాయ్ లేకుండా మణి మాత్రమే పాములు తీసుకొచ్చాడు.
చిన్నకుర్రాడివి నువ్వేంచెయ్యగలవురా అంటే మీకెలా షాట్ కావాలో చెప్పండిసార్ అద్దరగొడతాను అన్నట్లు మాట్లాడాడు. ఓ రాత్రి 8 గంటలకు మేడమీది గదిలో భానుచందర్, వనిత పడుకునివుంటే పాము బెడ్పైకెక్కి విలన్ పంపిన విషవాయువుని పీల్చేసే సీన్ తీస్తున్నాం.(విషవాయువు గ్రాఫిక్స్ అనుకోండి) బుట్టలోనుండి తీసిన రెండుమూడు పాములతో ఆ షాట్ తీయడానికి ప్రయత్నించినా లైట్స్ వేడికి ఒక్కపామూ నిలబడలేక వాలిపోతుంది. పౌరుషం వచ్చిన మణి గుడ్డసంచిలోవున్న మరోపాముని బయటికి తీశాడు. బుస్సున పడగవిప్పింది. అదెంతకోపంగా వుందంటే వాడిచేతిమీద నాలుగైదుసార్లు పడగతోకొట్టింది. చేతిమీద రక్తపు బొట్లు కనిపించటంతో అందరూ ఖంగారుపడుతుంటే ఇవన్నీ మాకు మామూలేసార్. వనిత గారి ఇన్సిడెంట్ చూశారుకదా ఎందుకు భయపడతారు అంటూ బెడ్ మీదపెట్టాడు పాముని.
షాట్ అయిపోయాక బుట్టలుతీసుకుని కిందికి వెళ్ళిపోయాడు మణి. కొంతసేపయ్యాక ఏదోపనిమీద నేను క్రింది ఫ్లోర్కి వెళితే మణి వాంతి చేసుకోవటానికి ప్రయత్నిస్తూ కనిపించాడు. చెయ్యిచూస్తే వాచివుంది. వాడు నవ్వుతూ నేవున్నా నా మనసు ఏదో కీడు శంకించింది. వాడు వొద్దంటున్నా బలవంతంగా మేనేజర్ మురళితో హాస్పిటల్కి పంపించాము. రాత్రి 11గంటలకు హోటల్ రూంలో భోజనానికి కూర్చుంటుంటే బెల్ మ్రోగింది. డోర్ ఓపెన్ చెయ్యగానే మేనేజర్ మురళి గారు మణి గాడు చనిపోయాడు సార్ అంటూ ఏడుస్తున్నాడు. కాళ్ళక్రింద భూమి కదిలిపోయింది. మద్రాసు భాయ్ కి ఫోన్ చేసి చెబితే అతను భోరుమంటూ…అది కొత్త పాము సర్. కొత్తగా పట్టి విషం తీసిన పాముని 4 నెలలు గుడ్డసంచిలో పెట్టి ఆ తరువాతే షూటింగ్స్లో వాడుతాము అప్పుడే దానిలో విషం పూర్తిగా పోతుంది.మణి కి ఆ విషయం తెలియక ఆ పాముని తెచ్చాడు అన్నాడు.
దానికంటే మాకు విస్మయం కలిగించిన అంశం … మణి ఐదేళ్ళక్రితం భోజనం లేక ఏ.వీ.యం.స్టూడియో పరిసరాల్లో తిరుగుతుంటే జాలి పడి చేరదీశాం. వాడి ఊరేదో తల్లితండ్రులెవరో కూడా మాకు తెలియదు.వాడి సామానంతా వెతికినా ఒక్క క్లూ అయినా దొరకలేదు అని చెప్పాడు భాయ్. ఏ తల్లి కన్నబిడ్డో…. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వైజాగ్ మట్టిలో కలిసిపోయాడు మణి. ఆ రోజు విజయదశమి.