కరోనా తరువాత నుంచి సినిమా రంగంపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే. ప్రేక్షకులు ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. మరోవైపు థియేటర్లలో టిక్కెట్ల ధరలను అమాంతం పెంచేశారు. ఇక అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అయితే టిక్కెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది ప్రేక్షకులు సినిమాలను చూడడమే మానేశారు. ప్రేక్షకులకు సినిమా రిలీజ్ అయిన రోజే పైరసీలో ఏకంగా హెచ్డీ ప్రింట్లు లభిస్తున్నాయని, ఇది తమకు తీవ్ర నష్టం కలిగిస్తుందని సాక్షాత్తూ నిర్మాతలే స్వయంగా అంగీకరిస్తున్నారు. దీంతో చిత్ర పరిశ్రమ గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర సంక్షోభాన్ని అనుభవిస్తుందని చెప్పవచ్చు. అయితే గోటి చుట్టుపై రోకలి పోటు అన్న చందంగా అసలే సినిమాలు నడవక బిజినెస్ అసలు లేని పరిస్థితిలో థియేటర్లు ఉంటే తాజాగా ఎగ్జిబిటర్లు సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ, తెలంగాణకు చెందిన సినిమా ఎగ్జిబిటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జూన్ 1 నుంచి థియేటర్లను బంద్ చేయనున్నామని తెలిపారు. తెలంగాణ, ఏపీ లకు చెందిన ఎగ్జిబిటర్లు తెలుగు ఫిలిం చాంబర్లో పలువురు నిర్మాతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు కూడా పాల్గొన్నారు.
ఈ సమావేశంలో భాగంగా ఎగ్జిబిటర్లు తమ ఆవేదనను నిర్మాతల ఎదుట. వెలిబుచ్చారు. అద్దె ప్రాతిపదికన థియేటర్లను నడిపించలేమని వారు చేతులెత్తేశారు. ఈ మేరకు నిర్మాతలకు లేఖ రాస్తామని స్పష్టం చేశారు. జూన్ 1 నుంచి నిరవధికంగా థియేటర్లను మూసేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ క్రమంలో జూన్లో రిలీజ్ కానున్న సినిమాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండనుందని అంటున్నారు. జూన్ 12న పవన్ నటించిన హరిహర వీరమల్లును రిలీజ్ చేయాలని చూస్తుండగా, జూన్ 27న మంచు విష్ణు నటించిన కన్నప్ప రిలీజ్ కానుంది. ఈ సినిమాలపై ఎగ్జిబిటర్ల నిర్ణయం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని భావిస్తున్నారు.