శరీరాన్ని ఎల్లప్పుడూ మనం హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. అంటే ఎప్పుడూ శరీరంలో తగినంత నీరు ఉండేలా చూసుకోవాలన్నమాట. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. నిత్యం తగినంత నీటిని తాగడం వల్ల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. ఏ సీజన్ అయినా, ఎక్కడ ఉన్నా, ఎప్పుడు అయినా సరే.. రోజులో తాగాల్సిన నీటి కోటాను కచ్చితంగా పూర్తి చేయాలి. దీంతో శరీరంలో నీరు తగినంత ఉంటుంది. అయితే నీటిని నిత్యం తగిన మోతాదులో తాగడం వల్ల కూడా అధిక బరువు తగ్గవచ్చు. అవును.. ఈ విషయాన్ని సాక్షాత్తూ సైంటిస్టులే చెబుతున్నారు.
2011లో ఒబెసిటీ అనే ఓ జర్నల్లో ఓ అధ్యయనాన్ని ప్రచురించారు. దాని ప్రకారం నీటిని నిత్యం తగిన మోతాదులో తాగడం వల్ల అధిక బరువు తగ్గుతారని వెల్లడైంది. అలాగే 2017లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబెసిటీలోనూ మరో అధ్యయనాన్ని ఇదే విషయంపై ప్రచురించారు. కొందరు నిత్యం తాము తాగే వివిధ రకాల డ్రింక్స్కు బదులుగా నీటిని తాగారు. దీంతో 12 నెలలపాటు వారు అలా చేయగా.. వారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గాయని, ఇన్సులిన్ సెన్సిటీవిటీ పెరిగిందని (శరీరం ఇన్సులిన్ను ఉపయోగించుకునే తీరు), అధిక బరువు తగ్గారని గుర్తించారు. అందువల్ల నీటిని నిత్యం తగిన మోతాదులో తాగితే కచ్చితంగా బరువు తగ్గవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.
* భోజనం చేయడానికి కనీసం 15 నిమిషాల ముందు నీటిని తాగితే ఆకలి తగ్గుతుందని, దీంతో కడుపు నిండిన భావన కలుగుతుందని సైంటిస్టులు తెలిపారు. ఇలా చేయడం వల్ల ఆహారం తక్కువగా తింటారని, దీంతో శరీరానికి క్యాలరీలు తక్కువగా అందుతాయని, ఫలితంగా బరువు తగ్గవచ్చని తెలిపారు.
* తగిన మోతాదులో నీటిని తాగడం వల్ల మనం తినే ఆహారాల్లో ఉండే కార్బొహైడ్రేట్లు (పిండి పదార్థాలు), ఫ్యాట్స్ (కొవ్వులు) వేగంగా జీర్ణం అవుతాయని, వాటి వల్ల శరీరానికి లభించే క్యాలరీలు కూడా త్వరగా ఖర్చవుతాయని సైంటిస్టుల అధ్యయనాల్లో వెల్లడైంది.
* నిత్యం నీటిని తగిన మోతాదులో తాగడం వల్ల శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. దీంతో వాపులు తగ్గుతాయి. ఒంట్లో ఉండే చెడు నీరు బయటకు పోతుంది. శరీరం సన్నగా కనిపిస్తుంది. బరువు కూడా తగ్గుతారు.
* కొన్నిసార్లు మెదడు ఆకలికి, దాహానికి కన్ఫ్యూజ్ అయి సిగ్నల్స్ ను వేరుగా పంపిస్తుంది. దీంతో కొందరు ఆకలి అవుతుందని పొరపాటు పడి ఆహారం తీసుకుంటారు. అయితే మీకు కూడా అలా కొన్ని సందర్భాల్లో వింతగా ఆకలి అనిపిస్తుంటే నీరు తాగి చూడండి. ఆకలి తగ్గుతుంది. అలా గనక జరిగితే మీ మెదడు తప్పు సిగ్నల్స్ ఇచ్చినట్లే లెక్క. దీంతో నీరు తాగడం వల్ల శరీరానికి అదనపు క్యాలరీలు లభించకుండా జాగ్రత్త పడవచ్చు.
* వ్యాయామం చేసేటప్పుడు కండరాలపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. అలాంటప్పుడు నీటిని ఎక్కువగా తాగాలి. దీంతో కండరాలు, కణజాలం, కీళ్లు సరిగ్గా పనిచేస్తాయి. ఈ క్రమంలో కండరాల నొప్పులు, అలసట తగ్గుతాయి. అలాగే వ్యాయామం ఎక్కువ సేపు చేయగలుగుతారు. బరువు త్వరగా తగ్గగలుగుతారు.
సాధారణంగా ప్రతి ఒక్కరికీ తాము ఎంత నీటిని తాగాలి ? అనే విషయం తెలియదు. అయితే ఎవరైనా సరే తమ ఎత్తు, బరువు, చేసే పని, జీవించే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నీటిని తాగాలి. సహజంగానే శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారు, వేడి వాతావరణంలో ఉండే వారు, చెమట ఎక్కువగా పట్టే వారు నిత్యం ఎక్కువ మోతాదులో నీటిని తాగాలి. వారు కనీసం 3 లేదా 4 లీటర్ల వరకు అవసరాన్ని బట్టి నీటిని తాగాల్సి ఉంటుంది. అదే ఇతరులు అయితే 2 లీటర్ల వరకు నీటిని తాగినా చాలు. కనుక నీటిని తగిన మోతాదులో నిత్యం తాగితే అధిక బరువును తగ్గించుకోవడంతోపాటు ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు.