Godhuma Ravva Bellam Payasam : గోధుమరవ్వను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. గోధుమరవ్వతో ఉప్మాతో పాటుగా రకరకాల తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. వాటిలో గోధుమరవ్వ పాయసం కూడా ఒకటి. గోధుమరవ్వతో చేసే ఈ పాయసం చాలా రుచిగా, కమ్మగా ఉంటుంది. దీనిని నైవేధ్యంగా కూడా తయారు చేసుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు ఇలా గోధుమరవ్వతో చిటికెలో పాయసాన్ని తయారు చేసి తీసుకోవచ్చు. ఈ పాయసాన్ని తయారు చేయడం చాలా సులభం. అలాగే చాలా తక్కువ సమయంలో దీనిని తయారు చేసుకోవచ్చు. ఎంతో కమ్మగా, తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే గోధుమరవ్వ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమరవ్వ పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసరపప్పు – 2 టేబుల్ స్పూన్స్, గోధుమరవ్వ – అర కప్పు, నీళ్లు – 4 కప్పులు, ఉప్పు – చిటికెడు, నెయ్యి – 2 టీ స్పూన్స్, డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా, బెల్లం తురుము – అర కప్పు కంటే కొద్దిగా ఎక్కువ లేదా ముప్పావు కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, కాచి చల్లార్చిన పాలు – ఒక కప్పు, పచ్చకర్పూరం – చిటికెడు.
![Godhuma Ravva Bellam Payasam : గోధుమ రవ్వ, బెల్లంతో కమ్మని పాయసం ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..! Godhuma Ravva Bellam Payasam recipe very tasty sweet to make](https://i0.wp.com/ayurvedam365.com/wp-content/uploads/2024/03/godhuma-rava-bellam-payasam.jpg?resize=1200%2C675&ssl=1)
గోధుమరవ్వ పాయసం తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో పెసరపప్పు వేసి కొద్దిగా రంగు మారే వరకు వేయించాలి. తరువాత దీనిని గిన్నెలోకి తీసుకుని బాగా కడగాలి. తరువాత అదే కుక్కర్ లో గోధుమరవ్వ వేసి వేయించాలి. గోధుమరవ్వ చక్కగా వేగిన తరువాత నీళ్లు, ముందుగా శుభ్రం చేసుకున్న పెసరపప్పు, ఉప్పు వేసి మూత పెట్టి మధ్యస్థ మంటపై ఉడికించాలి. దీనిని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కుక్కర్ ఆవిరి పోయిన తరువాత మూత తీసి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి నెయ్యితో సహా గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో బెల్లం తురుము, పావు కప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత దీనిని వడకట్టి ముందుగా ఉడికించిన గోధుమరవ్వలో వేసికలపాలి.
ఇప్పుడు ఈ కుక్కర్ ను మరలా స్టవ్ మీద ఉంచి 3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తరువాత పాలు పోసి కలపాలి. తరువాత కుక్కర్ ను మరలా స్టవ్ మీద ఉంచి 3 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా చేయడం వల్ల పాలు విరగకుండా ఉంటాయి. తరువాత పచ్చకర్పూరం, యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమరవ్వ పాయసం తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా గోధుమరవ్వ పాయసం తయారు చేసి తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.