నిత్యం వ్యాయామం చేయడం, ఆహార నియమాలను కఠినంగా పాటించడం.. వంటివి చేస్తే ఎవరైనా సరే చక్కని దేహదారుఢ్యాన్ని పొందుతారు. శరీరం చక్కని ఆకృతిలోకి వస్తుంది. ఈ క్రమంలో నిత్యం తీసుకునే పోషకాలతో కూడిన ఆహారంలో.. ఆరోగ్యాన్ని అందిస్తూ, బరువును తగ్గించే పదార్థాలను కూడా భాగం చేసుకోవాలి. ఆ విషయానికి వస్తే బెల్లం, నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తాయి. ఆయుర్వేద ప్రకారం.. నిత్యం ఈ రెండింటితో తయారు చేసిన పానీయాన్ని తాగడం వల్ల ఓ వైపు ఆరోగ్యం సురక్షితంగా ఉండడమే కాదు, పొట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు కూడా తగ్గుతారు.
నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఎల్లప్పుడూ ద్రవాలను సమతుల్యంలో ఉంచుతుంది. శరీర మెటబాలిజంను పెంచుతుంది. పరిశోధనల ప్రకారం.. నిమ్మరసంలో ఉండే పాలీఫినాల్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు బరువును తగ్గించడంలో అద్భుతమైన పాత్ర పోషిస్తాయి. ఇవి కొవ్వును కరిగిస్తాయి. శరీరంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ (హెచ్డీఎల్)ను పెంచుతాయి. దీంతోపాటు శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి.
చక్కెరను వాడొద్దనుకునే వారికి బెల్లం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో తక్కువ క్యాలరీలు ఉంటాయి. అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బెల్లంలో ఉండే జింక్, సెలీనియంలు శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. శరీరంలో పేరుకుపోయే విష పదార్థాలను బయటకు పంపుతాయి. అలాగే మెటబాలిజాన్ని పెంచి క్యాలరీలు ఎక్కువగా ఖర్చయ్యేలా చేస్తాయి. దీంతో అధిక బరువు తగ్గుతారు. నిత్యం బెల్లంను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే శ్వాసకోశ వ్యవస్థ, జీర్ణవ్యవస్థ శుభ్రమవుతాయి.
ఇక నిమ్మరసం, బెల్లం రెండింటినీ కలిపి నిత్యం తీసుకుంటే అధిక బరువును త్వరగా తగ్గించుకోవచ్చు. ఇవి రెండూ సూపర్ ఫుడ్స్ కనుక అధిక బరువు త్వరగా తగ్గుతారు. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 1 టీస్పూన్ నిమ్మరసం, చిన్న బెల్లం ముక్కను వేసి బాగా కలపాలి. బెల్లం నీటిలో కరిగేంత వరకు కలిపి అనంతరం ఆ నీటిని తాగాలి. దీన్ని నిత్యం ఉదయాన్నే పరగడుపునే తాగాలి. కావాలంటే అందులో కొన్ని పుదీనా ఆకులు వేసుకోవచ్చు. దీంతో ఆ పానీయానికి తాజాదనం వస్తుంది. ఈ మిశ్రమాన్ని రోజూ తాగడం వల్ల అధిక బరువు త్వరగా తగ్గుతుంది.