పొద్దు పొద్దున్న లేవగానే ఖాళీ కడుపుతో నిమ్మరసం కలిపిన నీళ్ళు తాగితే మంచిదని చెబుతుంటారు. అది కూడా కొంచెం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగాలని అంటారు. ఐతే దీనివల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం. నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీళ్ళలో కొన్ని ఎండు మెంతులు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది తాగడం వల్ల జీర్ణక్రియ పనితీరు మెరుగవడంతోపాటు కడుపు లోపలి విషపదార్థాలు బయటకి వెళ్ళిపోతాయి.
శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. నిమ్మలో ఉండే నీటిశాతం వల్ల శరీరానికి సరైన పాళ్లలో నీరు అందుతుంది. అదీగాక నిమ్మలో విటమిన్ సి ఉంటుంది. దాన్లో ఉండే ఆంటిఆక్సిడెంట్ల వల్ల చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. ఇంకా, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో బాగా ఉపయోగపడుతుంది. మలబద్దకం ఉన్నవారు నిమ్మరసం కలిపిన నీళ్ళు తాగితే మంచి ఉపశమనాన్ని పొందుతారు.
సాధారణంగా ప్రతి ఒక్క వంటగదిలో ఉండే మెంతులు మన ఆరోగ్యానికి మంచి మేలు చేస్తాయి. దీనిలో విటమిన్లు, పోషకాలు, ఇంకా ఫైబర్ కూడా ఉంటాయి. ఇవి యాంటీడయాబెటిక్ గా పనిచేస్తాయి. శరీరంలో కొవ్వుని తగ్గించి గుండె సంబంధిత సమస్యలు రాకుండా చూస్తాయి. మలబద్దకం ఉన్నవారికి మెంతులు చేసే మేలు అంతా ఇంతా కాదు.
మలబద్దకం ఉన్నట్లయితే నిమ్మరసం కలిపిన నీళ్ళలో మెంతులు కూడా కలుపుకుని పొద్దున్న పూట ఖాళీ కడుపుతో సేవించండి. బరువు తగ్గాలనుకున్న వారు తమ డైట్ లో ఖచ్చితంగా చేర్చుకోవాల్సిన పానీయం ఇది.