ప్రస్తుతం యువతలో బరువు తగ్గడం ఎంత పెద్ద ఛాలెంజ్గా ఉందో బరువు పెరగడం కూడా అంతే ఛాలెంజ్గా మారుతోంది. మరీ కొందరైతే ఎంత తిన్నా, ఎన్నిసార్లు తిన్నా బరువు మాత్రం పెరగరు. శరీరం కూడా ఎండుకుపోయినట్లు బక్కచిక్కి కనిపిస్తుంది. అలాంటి వారు తమ ఆహారపు అలవాట్లు కాస్త మార్చుకుంటే సరిపోతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా ఒక్కొక్కరి శరీరాన్ని బట్టి ఒక్కోలా మార్చుకోవాల్సి ఉంటుందని, కానీ సాధారణంగా కొన్ని మార్పులు చేసుకుంటే మన శరీర బరువులో వచ్చే మార్పులను గమనించవచ్చని అంటున్నారు. అంతేకాకుండా లావుగా కూడా అవుతారని చెప్తున్నారు.
సాధారణంగానే బరువు పెరగాలి లేదా లావు అవ్వాలి అంటే శరీరానికి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఆహారం తీసుకోవాలి. అయితే అది ఆరోగ్యవంతమైనదై ఉండాలి అలా కాకపోతే బరువుతో అనారోగ్యం కూడా పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి బాగా వేయించిన ఆహారం, ఎక్కువ తీపి పదార్థాలు, ఎక్కువగా కొవ్వులు ఉండే మాంసం లాంటి వాటిని మితంగానే ఉంచుకోవాలి. మీ బరువు నెలకు రెండు మూడు కేజీలు పెరగాలి అని అనుకుంటే.. రోజుకు అరలీటరు పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవాలి. రెండు గుడ్లు, రెండు వందల గ్రాముల చికెట్ లేదా చేప అయినా తీసుకోవచ్చు. వీటితో పాటు కనీసం రెండు, మూడు కప్పుల కాయగూరలు, ఆకుకూరలు కూడా మీ డైట్లో ఉండేలా చూసుకోవాలి.
అంతేకాకుండా రోజులో రెండుసార్లు స్నాక్స్ తినాలి. అందులో పళ్ళు, బాదం, ఆక్రోట్ ఉండేలా జాగ్రత్త పడాలి. రోజూ ఉదయాన్నే గుప్పెడు నానబెట్టిన వేరుశెనగలు తీసుకున్నా లాభం ఉంటుంది. వీటన్నింటితో పాటుగా బరువు పెరగాలంటే నిద్ర కూడా చాలా అవసరం. ప్రతి రోజూ కనీసం 8గంటల నిద్ర తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. అయితే రాత్రి భోజనానికి, నిద్రకు మధ్య 2 గంటల విరామం ఉండాలి. ఇవన్నీ చేస్తూ రోజులో ఒక అరగంటైనా వ్యాయామానికి కేటాయిస్తే శరీరంలో పెరిగే చెడు కొవ్వును ఎక్కువ కాకుండా నియంత్రించొచ్చు. తద్వారా బాడీ షేప్ కూడా మెయింటన్ చేయడం ఈజీ అవుతుంది.