సహజంగా పీడకలలు అందరికీ వస్తుంటాయి. పెద్ద వాళ్లకు ఈ సమస్య తక్కువగా ఉన్నప్పటికీ .. చిన్న వాళ్లకు పీడకలలు విపరీతంగా వస్తుంటాయి. అలా పీడకలు వచ్చినప్పుడు నిద్రలోనే ఉలిక్కిపడిన సందర్భాలను చూస్తూనే ఉంటాం. వీటి వల్ల భయంతోపాటు జ్వరం వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. చెడు ఆలోచనల వల్ల పీడకలలు వస్తుంటాయి. కోపం, నిరాశ, ఒత్తిడి, ఆందోళన, విచారం లాంటి భావాలకు లోనైనప్పుడు, లేదా అసంపూర్తిగా పనులు జరిగినప్పుడు పిల్లలకు పీడకలు వస్తుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. జ్వరం వచ్చినప్పుడు.. దెబ్బలు తగిలినప్పుడు.. బాధపడే క్షణాల్లో తల్లిదండ్రులు పక్కన లేనప్పుడు పిల్లలు ఒంటరిగా ఫీల్ అవుతారు.
మనసులో ఎవరూ లేరనే ముద్ర పడినప్పుడు తరచూ పీడకలలు వస్తుంటాయి. అయితే పీడకలల నుంచి బయట పడటానికి తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు ఇలా ఉన్నాయి. చిన్నపిల్లలు కంటి నిండా నిద్ర పోవాలి. అది ఎంతో ముఖ్యమైనది కూడా. కనీసం 3 గంటలపాటు గాఢంగా నిద్ర పోయేలా చూసుకోవాలి. పిల్లలపై ఒత్తిడి పెంచే పనులకు స్వస్తి పలకాలి. ఆరోగ్యకరమైన ఆహారం అందించేలా చూసుకోవాలి. మీ పిల్లలతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. మీరు కోపంగా ఉంటే మీకు చెప్పాలనుకున్న విషయాన్ని కూడా చెప్పలేకపోతారు. అప్పుడు అవన్నీ పీడకలలుగా మారి నిద్రకు భంగం కలిగిస్తాయి.
ఎక్కువ శాతం పిల్లలతో స్నేహితుడిలా మెలిగేలా చూసుకోండి. ఏ చిన్న కార్యక్రమాల్లో పాల్గొన్నా సపోర్ట్ చేయడం అలవాటు చేసుకోండి. అలా చేయడం వల్ల పిల్లలు సౌకర్యవంతంగా ఫీల్ అవుతారు. క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు.. ఏదైనా మంచి పని చేసినప్పుడు మెచ్చుకుంటే వాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా ఉంటుంది. సాధ్యమైనంత వరకు పిల్లలను మొబైల్ ఫోన్ల నుంచి దూరంగా ఉంచండి. స్మార్ట్ ఫోన్లను చేతిలో పెడితే ఆన్ లైన్ ఆటలు ఆడుతూ.. తిండి, నిద్రను మరిచిపోతారు. కడుపు నిండా ఆహారం.. కంటి నిండా నిద్ర ఉంటేనే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారు. హ్యాపీగా నిద్రపోతారు.