Eye Sight : మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కళ్లు కూడా ఒకటి. శరీరాన్ని నిత్యం సంరక్షించుకున్నట్లే కళ్లను కూడా సంరక్షించుకోవాల్సి ఉంటుంది. కళ్లపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. కళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అలాగే కంటి చూపు సరిగ్గా ఉండేలా జాగ్రత్తలు వహించాలి. అందుకు గాను కింద తెలిపిన సూచనలను పాటించాల్సి ఉంటుంది.
* విటమిన్లు ఎ, సి, ఇలతోపాటు జింక్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. వీటి వల్ల కళ్లలో ఉండే కణాలు దెబ్బ తినకుండా ఉంటాయి. అలాగే కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా క్యారెట్లు, ఎరుపు రంగు క్యాప్సికం, బ్రొకొలి, పాలకూర, స్ట్రాబెర్రీలు, చిలగడదుంపలు, నిమ్మజాతి పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల కంటి చూపు పెరుగుతుంది. కంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
* ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే చేపలు, అవిసె గింజలు, బాదంపప్పు వంటి పదార్థాలను తింటున్నా కూడా కంటిచూపు మెరుగు పడుతుంది.
* కెరోటినాయిడ్స్ ఉండే ఆకుపచ్చని కూరగాయలు, కోడిగుడ్లను తినాలి. దీని వల్ల కూడా కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కంటి చూపు పెరుగుతుంది.
* వారంలో కనీసం 5 రోజుల పాటు అయినా సరే వ్యాయామం చేయాలి. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేయవచ్చు. లేదా యోగా, మెడిటేషన్ వంటివి చేయవచ్చు. దీని వల్ల కళ్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది.
* డయాబెటిస్, హైబీపీ ఉన్నవారిలో కంటి చూపు దెబ్బతినేందుకు అవకాశం ఉంటుంది. కనుక అలాంటి వారు ఆయా సమస్యలను తగ్గించుకునేందుకు యత్నించాలి. డయాబెటిస్ ఉన్నవారు షుగర్ లెవల్స్ను అదుపులో ఉంచుకోవాలి. హైబీపీ ఉన్నవారు బీపీని కంట్రోల్ లో ఉంచుకోవాలి. దీంతో కళ్లు సురక్షితంగా ఉంటాయి. అలాగే ఆయా సమస్యలు ఉన్నవారు ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు చేయించుకోవాలి.
* ఎండలో వెళ్లినప్పుడు కళ్లకు రక్షణగా చలువ కళ్లద్దాలను ధరించడం వల్ల కళ్లు సురక్షితంగా ఉంటాయి. సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత (అల్ట్రా వయొలెట్) కిరణాలు నేరుగా కళ్లలో పడకుండా ఉంటాయి.
* కంప్యూటర్ల ఎదుట గంటల తరబడి కూర్చుని పనిచేసే వారు 20-20-20 రూల్ను పాటించాలి. అంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉండే వస్తువులను కనీసం 20 సెకన్ల పాటు చూడాలి. ఇలా చేయడం వల్ల కళ్లపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. కంటి ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉంటుంది.
* పొగతాడం మానేయడం వల్ల కూడా కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. అలాగే కళ్లద్దాలు, లెన్స్లను ధరించే వారు ఎప్పటికప్పుడు వాటిని శుభ్ర పరుచుకోవాలి. లేదంటే వాటిపై ఉండే సూక్ష్మ క్రిముల వల్ల కంటి వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు చేయించుకుని అందుకు అనుగుణంగా లెన్స్ లేదా అద్దాలను మార్చుకోవాలి. ఇలా కళ్లను సురక్షితంగా ఉంచుకోవచ్చు.