సెలూన్లో కటింగ్ చేయించుకున్నాక చాలా మంది మసాజ్ చేయించుకుంటారు. ఆయిల్తో తల మసాజ్ చేస్తారు. అనంతరం మెడను విరిచినట్టు రెండు వైపులా తిప్పుతారు. దీంతో చాలా హాయిగా ఉంటుందని అందరూ భావిస్తారు. అయితే హాయి మాట అటుంచితే అసలు ఇలా మెడను విరిచినట్టు మసాజ్ చేయించడం మాత్రం చాలా ప్రమాదమని వైద్యులు అంటున్నారు. అవును, మీరు విన్నది నిజమే. చాలా మంది సెలూన్లలో ఇలా మెడ విరుపు మసాజ్ చేయించుకుంటారు కానీ, దాంతో చాలా ప్రమాదం ఏర్పడుతుందని, శ్వాస వ్యవస్థ దెబ్బ తింటుందని వైద్యులు చెబుతున్నారు. మరి వారు ఇలా ఎందుకు చెబుతున్నారో తెలుసా..? అందుకు ఓ కారణం ఉంది. అదేమిటంటే…
ఢిల్లీకి చెందిన అజయ్ కుమార్(54) గతంలో కటింగ్ చేయించుకుని తలను మసాజ్ చేయించుకున్నాడు. అప్పుడు మెడలను గట్టిగా తిప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకు అతను శ్వాస తీసుకోవడం సమస్యగా మారింది. దీంతో కుమార్ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లాడు. అయితే అతన్ని పరీక్షించిన వైద్యులు అతని శ్వాస వ్యవస్థ దెబ్బతిందని చెప్పారు. ఈ క్రమంలోనే అతని ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. దీంతో అతడికి వెంటిలేటర్పై వైద్యులు చికిత్స అందించడం ప్రారంభించారు. అయితే ఇలా అజయ్కు ఎందుకు జరిగిందో వైద్యులకు మొదట తెలియలేదు. కానీ అనేక పరీక్షల అనంతరం చివరికి తెలిసిందేమిటంటే…
మెడను విరిచినట్టు మసాజ్ చేయించడం వల్ల అజయ్ మెడ భాగంలో నరాలు దెబ్బ తిన్నాయని వైద్యులు గుర్తించారు. నాడీ వ్యవస్థలోని ఫ్రెనిక్ నరాలు ఊపిరితిత్తుల కింది భాగంలోని విభాజక పటలంతో కలుపబడి ఉంటాయి. ఫ్రెనిక్ నరాలు దెబ్బతినడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందని వైద్యులు తెలిపారు. ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో విభాజక పటలం కూడా దెబ్బతిన్నట్లు చెప్పారు వైద్యులు. కాబట్టి తల మసాజ్ చేసేటప్పుడు మెడలను అటుఇటు గట్టిగా తిప్పడం సరైంది కాదని వైద్యులు సూచిస్తున్నారు. మెడ భాగం చాలా సున్నితమైన ప్రాంతం కాబట్టి మెడలను గట్టిగా తిప్పడం వల్లే నాడీ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తలను మసాజ్ చేయించుకోండి.. కానీ మెడలను గట్టిగా తిప్పకుండా ఉంటే ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి జాగ్రత్త, ఇకపై సెలూన్లో మెడను అలా తిప్పే మసాజ్ చేయించకండి. ఎందుకైనా మంచిది. లేదంటే ప్రాణాల మీదకు రావచ్చు..!