వెక్కిళ్లు అనేవి సాధారణంగా మనకు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. అవి చాలా స్వల్ప వ్యవధిలో తగ్గిపోతాయి. కానీ కొందరికి అదే పనిగా వెక్కిళ్లు వస్తూనే ఉంటాయి. కొందరికి సుమారుగా 48 గంటల పాటు వెక్కిళ్లు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే వెక్కిళ్లు ఎందుకు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వెక్కిళ్లు మన శరీరంలోని డయాఫ్రం వల్ల వస్తాయి. ఛాతీ కిందుగా.. పొట్ట పై భాగాన ఉండే వర్తులాకార పొరనే డయాఫ్రం అని పిలుస్తారు. ఇది శ్వాసక్రియను నిర్వర్తించే సమయంలో, ఆహారం తీసుకునేటప్పుడు అటూ, ఇటూ కదలి శరీరంలోని ఒత్తిడిని సమతుల్యంగా ఉండేట్లు చేస్తుంది. దీన్ని నియంత్రించడానికి మెదడులో ప్రత్యేక కేంద్రం ఉంటుంది. దీని నుండి బయలు దేరిన ఫ్రెనిక్ నాడి డయాఫ్రం వరకు ఉంటుంది.
డయాఫ్రం ఊపిరి పీల్చినప్పుడు ముడుచుకుని ఉంటుంది.ఊపిరి వదలగానే మళ్లీ మామూలు స్థితికి వస్తుంది. అయితే ఈ ప్రక్రియ ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంటుంది. ఈ క్రమంలోనే శ్వాసక్రియ కూడా సక్రమంగా జరుగుతుంది. అయితే ఏ కారణం చేతనైనా ఫ్రెనిక్ నాడి గానీ, డయాఫ్రం గానీ ఒక క్రమ పద్ధతిలో సమన్వయం చేసుకోలేకపోతే అప్పుడు ఆ క్రియకు భంగం కలుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గాలి పీల్చుకుంటే స్వరపేటిక హఠాత్తుగా మూసుకుంటుంది. దీనితో హిక్ అనే చప్పుడు వస్తుంది. అందుకనే ఇంగ్లిష్లో వాటిని హిక్కప్స్ అంటారు. ఈ క్రమంలో డయాఫ్రం మళ్లీ సక్రమంగా పనిచేసేదాకా ఈ విధంగా శబ్దం వస్తూనే ఉంటుంది. దాన్నే వెక్కిళ్లు అంటారు.
ఇక వెక్కిళ్లు వచ్చేందుకు పలు కారణాలు ఉంటాయి. అవేమిటంటే.. మూత్రపిండాలు, గుండె, కాలేయం వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, మెదడు సంబంధమైన వ్యాధులు, విష పదార్థాలను తీసుకోవడం, శరీరానికి సరిపడని ఆహార పదార్థాల వల్ల, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి వాటి వల్ల, భయం, దుఃఖం వంటి మానసిక కారణాల వల్ల, ఎక్కువగా మసాలా ఉన్న ఆహారం తినడం వల్ల, కారం ఎక్కువగా ఉన్న ఆహారం తినడం వల్ల, షుగర్ ఎక్కువైతే, మద్యం ఎక్కువగా సేవిస్తుంటే, పొగ ఎక్కువగా తాగుతుంటే, నోటిపూత, జీర్ణాశయ క్యాన్సర్, కామెర్లు, అలర్జీ, అజీర్ణం వంటి వాటి వల్ల వెక్కిళ్లు వస్తాయి. వెక్కిళ్లు వచ్చేందుకు ఇన్ని కారణాలు ఉంటాయి.
వెక్కిళ్లు తగ్గేందుకు పాటించాల్సిన చిట్కాలు
చక్కెరను లేదా ఏదైనా స్వీట్ను తింటే వెక్కిళ్లు తగ్గుతాయి. మంచినీళ్లు తాగినా, పచ్చి తాటాకును నమిలి ఊటను మింగుతున్నా, ఉదయం, సాయంత్రం రెండు పూటలా పల్లేరు కాయలు లేక చెట్టు కాడ రసాన్ని కొద్దిగా తేనెను కలిపి తీసుకుంటున్నా వెక్కిళ్లు తగ్గుతాయి.
అలాగే మామిడి ఆకుల్ని ఎండబెట్టి వాటిని కాల్చి వచ్చే పొగను పీల్చినా, తాటికాయను చిన్నగాటు పెట్టగా వచ్చిన నీరు లాంటి ద్రవాన్ని అరకప్పు తాగినా, రాతి ఉసిరికాయలు తింటున్నా, ప్రతిరోజూ వాటి రసం తాగినా, కొబ్బరి బోండాం నీళ్లను తాగినా వెక్కిళ్లు తగ్గుతాయి.
బఠాణీ గింజంత ఇంగువను గోరువెచ్చని నీళ్లలో వేసుకుని మింగినా, కొబ్బరిని చితక్కొట్టి ఆ పిప్పిని బాగా పిండితే పాల వంటి పదార్థం వస్తుంది, దానిని తాగినా, నిమ్మరసం తాగినా వెక్కిళ్లు తగ్గుతాయి. నాలుకకు తరుచుగా తేనె రాస్తున్నా, జామకాయను తిన్నా, శొంఠి లేదా కరక్కాయ పైపెచ్చు చూర్ణం అరచెంచాడు తీసుకుని చెంచాడు తేనెను కలిపి చప్పరించినా వెక్కిళ్లను ఆపవచ్చు.
శొంఠి, ఉసిరిక పలుకు, పిప్పళ్లు వీటన్నింటిని సమభాగాలుగా తీసుకుని కలిపి చూర్ణం చేసి పూటకు పావు చెంచాడు వంతున రోజూ రెండు పూటలా తింటున్నా వెక్కిళ్లు తగ్గుతాయి.
అయితే కొందరికి వెక్కిళ్లు ఎంత ప్రయత్నించినా తగ్గవు. నిరంతరాయంగ వస్తూనే ఉంటాయి. 48 గంటల వరకు అవి తగ్గాలి. ఆ సమయం దాటినా వెక్కిళ్లు తగ్గకపోతే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. లేదంటే తీవ్ర ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతాయి. అలాంటి స్థితిలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు. వెంటనే డాక్టర్ను కలిసి చికిత్స తీసుకోవాలి.