అందం ఎవరి సొంతం కాదు. కానీ కొందరు మాత్రం తెల్లగా ఉంటేనే అందంగా ఉన్నట్లు అనుకుంటుంటారు. అందుకోసం తెల్లగా రావాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో చెప్పే రకరకాల రెమెడీలను ట్రై చేసి లేనిపోని చిక్కుల్లో పడుతుంటారు. కొందరైతే వీటితో చర్మంపై లేనిపోని మచ్చలు వచ్చి మరింత ఆత్మన్యూనతకు గురవుతుంటారు. ముఖంపై ఏదైనా అలర్జీ వస్తే ప్రధానంగా పసుపు రాయడం ద్వారా దానిని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. తగ్గని సమయంలో వైద్యులను సంప్రదించడం మంచిది. కానీ కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చని సౌందర్య నిపుణులు చెప్తున్నారు. కానీ తెల్లటి చర్మమే అందం అనుకోవడం మాత్రం భ్రమే అని అంటున్నారు. అయితే చర్మం తెలుపుకు రావడం కోసం ఈ చిట్కాలను పాటించమంటున్నారు. మరి ఆ చిట్కాలు.. ఫేస్ మాస్క్లు ఏంటంటే..
సగం అవకాడో, టీస్పూన్ తేనె తీసుకుని బాగా కలుపుకోవాలి. ఆతర్వాత వచ్చిన మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించాలి. 20 నిమిషాలు ఆగిన తర్వాత గోరు వెచ్చని నీటితో మొఖాన్ని కడిగేసుకోవడమే. రెండు స్పూన్ల పెరుగు, రెండు స్పూన్ల ఓట్స్ తీసుకోవాలి. ముందుగా ఓట్స్ను పౌడర్లా చేసుకుని అందులో పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఐదు నిమిషాల పాటు మర్దనా చేసుకోవాలి. ఆ మిశ్రమం బాగా ఆరిపోయే వరకు లేదా 20-30 నిమిషాల పాటు ఉంచుకుని ఆ తర్వాత కడిగేసుకోవాలి. టీస్పూన్ తేనె, సగం అరటి పండు తీసుకుని మెత్తగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్ తరహాలో వేసుకోవాలి. 20 నిమిషాలు ఉంచుకుని కడిగేసుకుంటే సరిపోతుంది. అరటిపండు మన చర్మాన్ని మృదువుగా చేస్తుంది. తేనె మన చర్మానికి కావాల్సిన తేమను అందించడంతోపాటు చర్మం గ్లో వచ్చేలా చేస్తుంది.
మూడు స్పూన్ల శనగపిండి, రెండు టీస్పూన్ల పెరుగు తీసుకుని మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్చర్ను ముఖానికి పట్టించి అరగంట ఆగిన తర్వాత కడిగేసుకోవాలి. శనగపిండి చర్మంలోని మలినాలను తీసేయడంలో సహాయపడుతుంది. అలాగే పెరుగు చర్మానికి కావాల్సిన తేమను అందిస్తుంది. రెండు స్పూన్ల రోజ్ వాటర్, టీస్పూన్ గ్లిజరిన్ను బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. అరగంట ఆగిన తర్వాత కడిగేసుకోవాలి. రోజ్ వాటర్ మన చర్మం రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. గ్లిజరిన్ చర్మంలోని తేమను పెంచి అందంగా మారుస్తుంది.
వీటితో పాటుగా ఇంత పని కూడా చేసుకోలేం అనుకునే వారు మార్కెట్లో దొరికే విటమిన్-ఇ కాప్సుల్స్ను తీసుకుని ఒక కాప్సుల్కు రంధ్రం చేసి లోపలి ఔషధాన్ని చేతిలో వేసుకోవాలి. అందులో రెండు మూడు చుక్కల కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్ లేదా బాదం ఆయిల్ కలుపుకుని ముఖానికి బాగా పట్టించాలి. అరగంట ఆగిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా కూడా చర్మ సౌందర్యం పెరుగుతుందని సౌందర్య నిపుణులు చెప్తున్నారు.