కడుపులో నొప్పి సమస్య సహజంగానే అప్పుడప్పుడు కొందరికి వస్తుంటుంది. అందుకు పలు కారణాలు ఉంటాయి. వికారం, గ్యాస్, అసిడిటీ రావడంతోపాటు జీర్ణం కాని ఆహారాలను తినడం, ఫుడ్ పాయిజనింగ్ అవడం, కారం, మసాలాలు అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినడం.. వంటి అనేక కారణాల వల్ల కడుపు నొప్పి వస్తుంటుంది. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే కడుపునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
1. కడుపు నొప్పిని తగ్గించడంలో అల్లం బాగా పనిచేస్తుంది. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో అల్లం కొద్దిగా వేసి బాగా మరిగించాలి. అనంతరం ఏర్పడే కషాయాన్ని తాగాలి. దీంతో కడుపునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. లేదా నేరుగా రెండు టీస్పూన్ల అల్లం రసంను కూడా సేవించవచ్చు. దీంతోనూ సమస్య తగ్గుతుంది.
2. పుదీనా ఆకులను కొన్నింటిని తీసుకుని నీటిలో మరిగించి ఆ నీటిని తాగుతుండాలి. దీంతో జీర్ణ సమస్యలు తగ్గుతాయి. కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
3. ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ బేకింగ్ సోడాలను కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
4. దాల్చిన చెక్క పొడిని నీటిలో వేసి మరిగించి అనంతరం నీటిని వడకట్టి ఆ నీరు వేడిగా ఉండగానే తాగేయాలి. దీని వల్ల కూడా కడుపునొప్పి, జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
5. భోజనం చేసిన తరువాత ఒకటి లేదా రెండు లవంగాలను నోట్లో వేసుకుని నములుతూ ఆ రసాన్ని మింగాలి. జీర్ణ సమస్యలను లవంగాలు తగ్గిస్తాయి. కడుపు నొప్పి తగ్గుతుంది.
6. జీలకర్రను నీటిలో వేసి బాగా మరిగించి కషాయంలా కాచి తాగుతుంటే గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి తగ్గుతాయి.
7. అంజీర్ పండ్లను తింటున్నా, కలబంద గుజ్జును సేవించినా, తులసి ఆకులను నమిలినా, కొబ్బరి నీళ్లు, అరటిపండ్లను తీసుకున్నా కడుపు నొప్పి, జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు.
ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం టెలిగ్రామ్లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365