చైనాకి భారీ సైన్యం, బలమైన ఆర్థిక వ్యవస్థ ఉంది. పాకిస్తాన్ తో పోలిస్తే, చైనాతో తలపడటం చాలా కష్టం. అందుకే భారతదేశం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది, ఎక్కువగా మాట్లాడే ధైర్యం చెయ్యదు. ఈ మధ్యనే అరుణాచల్ ప్రదేశ్ లో ప్రాంతాలను చైనా కొత్తపేర్లు పెట్టడం జరిగింది. ఇదే పాకిస్తాన్ చేసి ఉంటే ఈ పాటికి ఇక్కడ రాజకీయ నాయకులు గోల గోల చేసేవారు. కానీ అలా చేయకపోవడానికి కారణం, మనం పులి అయితే, చైనా ఒక డ్రాగన్. భారత్, చైనా మధ్య పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది. వీళ్ల మధ్య గొడవలు ఉన్నా, రెండు దేశాలు కూడా పరిస్థితిని నిలకడగా ఉంచడానికి ప్రయత్నిస్తాయి. అందుకే భారత్ చైనా మీద గట్టిగా మాట్లాడదు.
జనం కూడా పాకిస్తాన్ గురించి అయితే చాలా కోపం వ్యక్తం చేస్తారు, ఎందుకంటే అది భద్రతా సమస్యలకు సంబంధించినది, ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతోంది. కానీ చైనా భూమిని ఆక్రమించిన విషయానికి వస్తే, అలా react అవ్వరు. మన మీడియా ఎక్కువగా పాకిస్తాన్ సమస్యలకు ప్రాధాన్యం ఇస్తుంది. చైనా సరిహద్దు సమస్యల గురించి వార్తలు తక్కువగా వస్తాయి లేదా సున్నితంగా చూపిస్తారు. దీనివల్ల ప్రజలకు పూర్తి సమాచారం అందదు.
ప్రపంచం ఈ రెండు సమస్యల్ని భిన్నంగా చూస్తుంది. పాకిస్తాన్ సమస్యను ఉగ్రవాదం, భద్రతా సమస్యగా భావిస్తారు. చైనా విషయంలో అది రెండు పెద్ద శక్తుల మధ్య వ్యూహాత్మక పోటిగా చూస్తారు. అందుకే భారత్ కూడా వేర్వేరు విధానాలు తీసుకుంటుంది. చైనా తీసుకున్న ప్రాంతాలు (అక్సాయి చిన్) ఎక్కువగా కొండలైన ఎత్తైన, వనరులు తక్కువగా ఉన్న పర్వత ప్రాంతాలు, అంటే తక్కువ జనాలు ఉండే ఖాళీ ప్రాంతాలు. అందుకే అక్కడ పెద్దగా ప్రజల సమస్యలు ఉండవు. కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో చాలా మంది ప్రజలు ఉన్నారు, అందువలన ఆ ప్రాంతంలోని సమస్యలు, భద్రతా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి.