ఆకర్షణీయమైన రంగు కలిగి తింటే అమోఘమైన రుచిని ఇచ్చే పసందైన చాక్లెట్లు అంటే ఇష్టం ఉండనిది ఎవరికి చెప్పండి. వాటిని చాలా మంది ఇష్టంగా తింటారు. ఇక చిన్నారులైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాక్లెట్ ఇస్తామంటే వారు ఏ పనైనా చేస్తారు. ఆ మాటకొస్తే పెద్దలు కూడా చాక్లెట్లను బాగానే తింటారు. అయితే చాక్లెట్ ప్రియులకు ఇప్పుడు మేం చెప్పబోయేది వింటే షాక్ తగలడం ఖాయం. అవును, మీరు విన్నది నిజమే. ఎందుకంటే విషయం అలాంటిది మరి. అదేమిటంటే.. త్వరలో.. అంటే.. మరో 30 సంవత్సరాల్లో చాక్లెట్లు ఇక కనుమరుగు కానున్నాయి. చెప్పాం కదా, షాక్ తగులుతుందని. అయితే ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
చాక్లెట్లను ఎలా తయారు చేస్తారో తెలుసు కదా. కొకొవా ప్లాంట్ కు చెందిన కొకొవా విత్తనాల నుంచి కొకొవాను తీసి చాక్లెట్లను తయారు చేస్తారు. అయితే ఈ కొకొవా మొక్కలు ఎక్కువగా ఆఫ్రికన్ దేశాల్లో పెరుగుతాయి. ఇవి పెరగాలంటే వాతావరణ పరిస్థితులు ఎప్పుడూ ఒకే రకంగా ఉండాలి. అంటే.. ఉష్ణోగ్రత, తేమ, ఇతర అంశాలు అన్నీ 365 రోజులూ స్థిరంగా ఉండాలి. అస్సలు మారకూడదు. అలా ఉంటేనే కొకొవా మొక్కలు పెరుగుతాయి.
అయితే నేటి తరుణంలో సంభవిస్తున్న గ్లోబల్ వార్మింగ్ వల్ల కొకొవా పండే ప్రాంతాల్లో వాతావరణం బాగా వేడెక్కుతోందట. దీంతో కొకొవా పంట త్వరలో అంతరించే అవకాశం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. మరో 30 నుంచి 40 ఏళ్ల కాలంలో కొకొవా మొక్కల జాతి పూర్తిగా అంతరించిపోతుందని, అందుకు గ్లోబల్ వార్మింగే కారణమని సైంటిస్టులు అంటున్నారు. దీంతో 2050 వ సంవత్సరం వరకు కొకొవా మొక్కలు పూర్తిగా అంతరించిపోతే అప్పుడు మనకు చాక్లెట్ లభించదు అని సైంటిస్టులు అంటున్నారు. కనుక మీరు చాక్లెట్ ప్రియులు అయితే త్వరపడండి. వీలున్నంత చాక్లెట్ను ఆరగించేందుకు ప్రయత్నించండి. కానీ ఆరోగ్యం జాగ్రత్త సుమా..! అయితే ఈ విషయం తెలుసుకున్న మరికొందరు సైంటిస్టులు చాక్లెట్లను కృత్రిమంగా తయారు చేసేందుకు ఇప్పుడే పరిశోధనలు ప్రారంభించారు. చూద్దాం మరి.. అవి ఎంత వరకు సక్సెస్ అవుతాయో..!