మన జీవితకాలంలో కొన్ని కొన్ని ప్రదేశాలను తప్పనిసరిగా సందర్శిస్తుండాలి. ఒక్కసారైనా వెళ్లిరావాలి. ఆధ్యాత్మిక ప్రదేశాలకు, సాంస్కృతిక ప్రదేశాలకు, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలకు వెళ్లడం సహజంగా జరుగుతుండే పరిణామం. దీనివల్ల మనసు ఆహ్లాదమవడమే కాకుండా రోజువారీ దినచర్య నుంచి కొంత సేద తీరవచ్చు. కొంతమందైతే నెలకోసారి, రెండు నెలలకోసారి కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్లివస్తుంటారు. అందరికీ అలా వీలుపడదు కాబట్టి, సాధ్యమైనంతమేరకు సమయం చూసుకొని, కుటుంబ సభ్యులతో కలిసి ఆయా ప్రదేశాలకు వెళ్లిరావాలి.
అలా వెళ్లాల్సిన ప్రదేశాల్లో అందమైన, అద్భుతమైన రైల్వేస్టేషన్ కూడా ఉంది. మనదేశంలో ఉన్న 7200 రైల్వేస్టేషన్లలో తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఉండే స్టేషన్లు ప్రకృతి రమణీయమైన ప్రదేశాల మధ్య నిర్మించారు. అందమైన జలపాతాలు, పచ్చని అడవుల మధ్య మలుపులు, సొరంగాలు.. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉంటాయి. అలాంటివాటిల్లో తమిళనాడులోని లవ్ డేల్ రైల్వేస్టేషన్ ఒకటి. దీన్ని బ్రిటీష్ కాలంలో నిర్మించారు. ఊటీకి దగ్గరగా ఉంటుంది. అత్యంత ప్రశాంతమైన రైల్వేస్టేషన్ గా ఇది పేరు తెచ్చుకుంది. చుట్టూ భారీగా పెరిగిన చెట్లు, నీలం రంగులో ఉండే ఆకాశం, దట్టంగా ఉండే మబ్బులు, అత్యంత చల్లగా ఉండే వాతావరణంతో మనసును లవ్ డేల్ దోచేస్తుంది.
1907లో తెల్లదొరలు తమ అవసరాల కోసం లవ్ డేల్ ను నిర్మించారు. సముద్ర మట్టానికి 7193 అడుగుల ఎత్తులో ఉండి రైల్వే ట్రాక్, స్టేషన్ రోడ్డుకు సమాంతరంగా ఆనుకొని ఉండటమే దీని ప్రత్యేకత. ఒక కుటీరంలా కనిపిస్తుంది. రోజుకు నాలుగు రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ స్టేషన్ ను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. తమిళనాడు వెళ్లేవారు, ఊటీ వెళ్లేవారు తప్పనిసరిగా నీలగిరి మౌంటెన్ ట్రాయ్ రైలు ఎక్కుతారు. వారంతా లవ్ డేల్ రైల్వేస్టేషన్ ను చూసే అవకాశం లభిస్తుంది.