షుగర్ వ్యాధి నియంత్రణ తప్పితే….శరీరంలో ప్రధాన అవయవాలైన, కళ్లు, కిడ్నీలు, నరాల వ్యవస్ధ అన్నీ దెబ్బతింటాయి. రక్త సరఫరా దెబ్బతింటుంది. రక్తపోటు పెరుగుతుంది. అధిక బరువు, కొల్లెస్టరాల్ కలిగి రక్తనాళాలు బ్లాక్ అవుతాయి. షుగర్ వ్యాధిలో కళ్ళను ఎలా కాపాడుకోవాలి? షుగర్ వ్యాధి అదుపు తప్పితే త్వరగా కనుక్కోలేకపోతే, కళ్లు అంధత్వానికి గురయ్యే ప్రమాదం వుంది. మొదట్లో చిహ్నాలు కనపడవు. కంటి రెటీనాను ఎప్పటికపుడు చెక్ చేయించుకుంటూ వుండాలి. కంటి డాక్టర్ కు మీకు డయాబెటీస్ వుందని చెప్పాలి. అపుడే సరైన పరీక్షలు నిర్వహించగలుగుతాడు. షుగర్ వ్యాధి బాధితులకు పాదాల జాగ్రత్త అత్యవసరం.
ఈ వ్యాధిగ్రస్తులకు పాదాలకు గాయాలైతే వారికి తెలియదు. దీనికి కారణం ఆయా ప్రాంతాల భాగాలలోని రక్త నాళాలలో రక్త సరఫరా దెబ్బతినడమే. గాయాలు త్వరగా నయం కావు. డయాబెటీస్ వున్నవారికి గాయాలైతే, ఇన్ ఫెక్షన్ చాలా త్వరగా శరీర భాగాలలో వ్యాపిస్తుంది. పాదాలకు వీరు సరి అయిన పాదరక్షలు ప్రత్యేకించి బూట్ల వంటివి వాడి గాయాలు అవకుండా చూసుకోవాలి. ఏ చిన్న గాయమైనప్పటికి వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్ససత్వరమే పొందాలి. పాదాలు ఎల్లపుడూ పొడిగా, శుభ్రంగా వుంచుకోవాలి. గోళ్ళు కత్తిరించుకోవాలి. మాయిశ్చరైజింగ్ క్రీములు రాసి పొడిబారకుండా లేదా పగుళ్ళు ఏర్పడకుండా చూడాలి.
పగుళ్ళనుండే వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం వుంది. పాదాలు ఎర్రబడ్డా, అసాధారణమైన నొప్పి కలుగుతున్నా, పుండ్లు, కోతలు, వాపు మొదలైనవి వచ్చినా లేదంటే రంగు మారినా తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి. వైద్యం ఆలస్యమయితే గాంగ్రిన్ ఏర్పడే ప్రమాదం వుంది. కాళ్ళలో రక్త సరఫరా సరిగా లేకుంటే సరైన వైద్యం వెంటనే తీసుకోవాలి. షుగర్ వ్యాధిగ్రస్తుల కిడ్నీలకు షుగర్ వలన కలిగే డామేజీని వెంటనే కనుగొనలేరు. కనుక కనీసం సంవత్సరానికొకసారైనా వీరు కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. మూత్రాన్ని రక్తం, ప్రొటీన్ కొరకు పరీక్షిస్తారు. కిడ్నీలు డయాబెటీస్ వలన దెబ్బతింటే మూత్రంలో ప్రొటీన్ పోతూ వుంటుంది. ప్రొటీన్ అధికంగా పోతే, కిడ్నీ పాడవుతుంది. కనుక వెంటనే వైద్యంతో ప్రొటీన్ లీక్ కాకుండా చూసుకోవాలి. షుగర్ వ్యాధివలన శరీర అవయవాలకు జరిగే నష్టాలు సత్వరమే కనుగొని వైద్యం చేయించకుంటే, తీవ్ర సమస్యలు ఏర్పడతాయి. కనుక షుగర్ వ్యాధి రోగులకు శరీర పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవడం అత్యవసరంగా చెప్పవచ్చు.