ఇప్పుడు ఏ పల్లెను చూసినా విష జ్వరాలతో మంచాన పడిన మనుషులు, డాక్టర్ల చుట్టూ, హాస్పిటల్స్ ముందు బారులు తీరిన జనాలే కనిపిస్తున్నారు. జనాలపై డెంగ్యూ ప్రభావం విపరీతంగా కనిపిస్తుంది. డెంగ్యూ గురించి పూర్తిగా తెలుసుకొని, నివారణ చర్యలను చేపడదాం. ఇప్పటికే ఈ లక్షణాలుంటే త్వరగా డాక్టర్ ను సంప్రదించి ఫస్ట్ స్టేజ్ లోనే దీనిని అడ్డుకుందాం. ఈ వ్యాధి ఈడిస్ ఈజిప్ట్ దోమ కారణంగా సోకుతుంది. నల్లగా ఉండే ఈ దోమ ఒంటిమీద తెల్లని చారలుంటాయి. శరీరంలోకి ఈ డెంగీ వైరస్ ప్రవేశించిన వారం రోజుల తర్వాత వ్యాధి వ్యాప్తి చెందుతుంది. శరీరంలో ప్లేట్లెట్లు తగ్గిపోయి.. మనిషి చాలా నీరసంగా తయారవుతాడు. ఆలస్యంగా స్పందిస్తే చనిపోయే ప్రమాదముంటుంది.
డెంగ్యూ ఒక రకమైన ఆర్బోవైరస్ వలన సంక్రమిస్తుంది. ఒకరి నుండి మరొకరికి ఏడిస్ ఈజిప్ట్ అనే దోమ కాటు వలన వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలు పగలే కుడతాయి. వ్యాధి లక్షణాలు ఇలా ఉంటాయి. రక్త పోటుతో పాటు రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. వాంతులు, విరేచనాలు రక్తంతో కూడిన మల విసర్జన కడుపునొప్పి ఉంటాయి. హఠాత్తుగా తీవ్రమైన జ్వరం వస్తుంది. ఎముకల్లో, కండరాల్లో భరించలేని నొప్పిగా ఉంటుంది. తలనొప్పి అధికంగా ఉంటుంది. నోరు ఎండిపోతుంది. దాహం ఎక్కువగా అవుతుంది.
దోమలు ఎయిర్ కూలర్లు, రిఫ్రిజిరేటర్లు గల డ్రిప్ ఫ్యాన్, పూలకుండీల కింద గల సాసర్లు, బయట పెట్టిన టైర్లు, మూతలు పెట్టని నీరు నిల్వచేసే తొట్టీలు, కుండీలు, ఫౌంటెన్స్, ఖాళీ డ్రమ్ములు, సన్ షేడ్స్ పై నిల్చిన వాన నీరు, బిల్డింగ్ల పైన నిల్చిన వాన నీటిలో ఎక్కువగా పెరుగుతాయి. ఈ దోమ ఇంట్లో గల చీకటి ప్రదేశాల్లో నివసిస్తుంటుంది. వాడకుండా వదిలి వేసిన పచ్చడి రోళ్లు, ఫ్లవర్వాజ్, కొబ్బరి చిప్పలు, పగిలిన సీసాలు, పగిలిపోయిన కప్పులు, చెట్టు తొర్రలు మొదలైన వాటిలో ఎక్కువగా పెరుగుతుంది. ఎప్పటికప్పుడు వీటిని శుబ్రపరుచుకుంటే.. దోమల వ్యాప్తి ఉండదు. దోమల వ్యాప్తి తగ్గితే డెంగ్యూ ను మన పరిధిలో నివారించినట్టే.