భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి పాలు, పాల ఉత్పత్తులను విరివిగా తమ ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. పాలలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవన్నీ మనకు పోషణను, శక్తిని అందిస్తాయి. అయితే ఆయుర్వేద ప్రకారం పాలను ఏ సమయంలో తాగితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆయుర్వేద ప్రకారం పాలను తాగేందుకు ఉత్తమమైన సమయం.. రాత్రి. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు పాలను తాగాల్సి ఉంటుంది. పాలను తాగేందుకు అదే సరైన సమయం. ఇక అందులో అశ్వగంధ చూర్ణం కలుపుకుని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. నిద్ర చక్కగా పడుతుంది.
అలర్జీలు ఉన్నవారు తప్ప ఎవరైనా సరే నిరభ్యంతరంగా పాలను తాగవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. అయితే జిమ్ చేసేవారు, వ్యాయామం చేసే వారు, శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు, 5 ఏళ్ల లోపు పిల్లలు ఉదయాన్నే పాలు తాగడం మంచిది. ఇక మిగిలిన ఎవరైనా సరే రాత్రి పూట పాలను తాగాలి.
రాత్రి పూట పాలను తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నిద్ర చక్కగా వస్తుంది. నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. రాత్రి పూట మనం పని చేయం కాబట్టి శరీరం పాలలోని కాల్షియంను ఎక్కువగా శోషించుకుంటుంది. దీంతో కాల్షియం లోపం ఏర్పడకుండా నివారించవచ్చు. ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
ఇక పాలను నేరుగా తాగాల్సి ఉంటుంది. మిల్క్ షేక్స్ రూపంలో ఎట్టి పరిస్థితిలోనూ తాగరాదు. పాలను మామిడి పండ్లు, అరటి పండ్లు, పుచ్చకాయలు, ఇతర పండ్లతో కలిపి అస్సలు తీసుకోరాదు. లేదంటే శరీరంపై నెగెటివ్ ప్రభావం పడుతుంది. జీర్ణ సమస్యలు వస్తాయి. జఠరాగ్ని తగ్గుతుంది. అజీర్ణం, గ్యాస్ సమస్యలు వస్తాయి. శరీరంలో విష పదార్థాలు పేరుకుపోతాయి. సైనస్, దగ్గు, జలుబు, అలర్జీలు, దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి. కనుక పాలను ఎట్టి పరిస్థితిలోనూ పండ్లతో కలిపి తీసుకోరాదు. వాటిని నేరుగానే తాగాల్సి ఉంటుంది. వీలుంటే పాలలో పసుపు, మిరియాల పొడి, అశ్వగంధ చూర్ణం, తేనె వంటివి కలుపుకుని తాగవచ్చు. అది కూడా రాత్రి పూటే ఇలా తాగాలి. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం టెలిగ్రామ్లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365