Ravi Chettu Pooja : ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు అంటుంటారు. అంటే ప్రపంచంలో అన్నింటికీ ధనం కావాలి.. ధనంపైనే ఈ జగత్తు (ప్రపంచం) నడుస్తుందని అర్థం. అందుకనే మనిషి నిత్యం ధనం కోసం అన్వేషిస్తుంటాడు. డబ్బులు ఎలా సంపాదించాలి.. అని ఆలోచిస్తుంటాడు. అయితే ఈ విషయంలో కొందరు త్వరగా వృద్ధిలోకి వస్తారు. కానీ కొందరు మాత్రం అక్కడే ఉండిపోతారు. ఎలాంటి కష్టం పడినా సరే జీవితంలో పెద్దగా మార్పు ఉండదు. నిత్యం ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుంటాడు. ఇలా చాలా మందే ఉన్నారు. అయితే కింద చెప్పిన విధంగా పలు సూచనలు పాటిస్తే.. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నవారికి కాస్త ఉపశమనం కలుగుతుంది. ధనం సంపాదించేందుకు కావల్సిన అనుగ్రహం లక్ష్మీదేవి నుంచి లభిస్తుంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో ఈశాన్యమూలన తులసి మొక్కను పెంచండి. పూజ గదిలో గంగాజలాన్ని ఉంచండి. దీనివల్ల ధనం పెరుగుతుంది. ఇంట్లో కూర్చొని ఉన్న లక్ష్మీదేవీ (ఇరువైపులా దిగ్గజాలు అంటే ఏనుగులు ఉన్న) ఫొటో పెట్టుకోండి. వ్యాపార సంస్థల్లో అయితే నిలుచున్న ఫొటోను పెట్టుకోవాలి. లక్ష్మీ దేవీ స్వభావం చంచలం. అమ్మ స్థిరంగా ఉండాలంటే లక్ష్మీపతి వెంట ఉంటే తప్పక ఆమె అక్కడ స్థిరంగా ఉంటుంది. అంటే నారాయణుడు (విష్ణువు) ఎక్కడ ఉంటే లక్ష్మీ అక్కడ ఉంటుందన్నమాట. కాబట్టి నారాయణుడిని ప్రసన్నం చేసుకునే పనులు ఎక్కువగా చేయాలి.
శ్రీనివాసుడిని లేదా శ్రీహరి లేదా వేంకటేశ్వరుడికి సంబంధించిన జపాన్ని కొంత సేపు నిష్ఠతో చేయండి. లేదా ధ్యానం చేయండి. కొంత కాలానికి మీకు మార్పు కనిపిస్తుంది. అవకాశం ఉన్నవారు రావిచెట్టుకు శనివారం, మంగళవారం పాలు, నీళ్లు, బెల్లం కలిపి పోసి ప్రార్థన చేయాలి. రావిచెట్టును అశ్వత్థ వృక్షం అంటారు. సాక్షాత్ విష్ణుస్వరూపం అయిన రావిచెట్టును ఎవరు పూజిస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. అందువల్ల పైన తెలిపిన విధంగా చేస్తే.. తప్పక లక్ష్మీ అనుగ్రహాన్ని పొందవచ్చు. దీంతో ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. ధనం బాగా సంపాదిస్తారు. సంపదకు లోటు లేకుండా ఉంటుంది.