Shahi Veg Kurma : మనం చపాతీ, నాన్, బటర్ నాన్ వంటి వాటిని తినడానికి వెజ్ కుర్మా వంటి వాటిని తినడానికి షాహీ వెజ్ కుర్మాను తయారు చేస్తూ ఉంటాం. కూరగాయ ముక్కలు వేసి చేసి ఈ వెజ్ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ షాహీ వెజ్ కుర్మాను హైదరాబాదీ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాదీ షాహీ వెజ్ కుర్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన బంగాళాదుంప – 1, తరిగిన క్యారెట్ – 1, తరిగిన బీన్స్ – 8, పచ్చి బఠాణీ – పావు కప్పు, పన్నీర్ – 100 గ్రా., ఫ్రైడ్ ఆనియన్స్ – ఒక కప్పు, జీడిపప్పు – 3 టేబుల్ స్పూన్స్, తరిగిన టమాటాలు – 2, తరిగిన క్యాప్సికం – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కసూరి మెంతి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, పెరుగు – పావు కప్పు, దాల్చిన చెక్క ముక్క – 1, లవంగాలు – 2, సాజీరా – ఒక టీ స్పూన్.

మసాలా దినుసులు..
యాలకులు – 5, లవంగాలు – 6, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, సాజీరా – ఒక టీ స్పూన్, జాపత్రి – 1.
హైదరాబాదీ షాహీ వెజ్ కుర్మా తయారీ విధానం..
ముందుగా కళాయిలో అర లీటర్ నీళ్లు, ఉప్పు వేసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక క్యారెట్, బీన్స్, బంగాళాదుంప, పచ్చి బఠాణీ వేసి 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత వీటిని వడకట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు, టమాట ముక్కలు, జీడిపప్పు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత పావు గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి టమాట మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. టమాట ముక్కలు మెత్తగా అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం పేస్ట్ వేసి వేయించాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ ను పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు మధ్యస్థ మంటపై ఉడికించాలి. తరువాత ఉడికించిన కూరగాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, పన్నీర్ వేసి కలపాలి. తరువాత కూరగాయలు ఉడికించిన నీళ్లను పోసి కలిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత కొత్తిమీర, కసూరి మెంతి, పుదీనా వేసి మరో రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే షాహీ వెజ్ కుర్మా తయారవుతుంది. దీనిని చపాతీ, రోటీ, నాన్, పుల్కా, బిర్యానీ, పులావ్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కుర్మాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.