రమేశ్ కుమార్ విశ్వాస్! A 11 సీట్! అంత పెద్ద విమానం అహ్మదాబాద్ లో మెడికల్ కాలేజీ బిల్డింగ్ పైన పడగానే 242 మంది ప్రయాణికులు లో ఒకే ఒక్కడు ఎలా బ్రతికాడు? సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు విమానాలలో ఉండే మనుషులు బతకడం అత్యంత అరుదు అనే చెప్పాలి. అంత భారీ ఎత్తు నుంచి పడి పేలిపోయినప్పుడు అసలు ఎవరైనా బతుకుతారా అని ఊహించడం కూడా కష్టమే. కానీ ఒక్కడు మాత్రం యాదృచ్ఛికంగానో లేక ఇతర కారణాల వల్లో బయట పడ్డాడు. దీంతో ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎ11 సీట్ కు ఇప్పుడు ప్రాధాన్యత కూడా పెరిగింది.
నిపుణులు ఊహించేది ఏమంటే అతను ఉన్న సీట్ ఎమర్జెన్సీ డోర్ దగ్గరే. విమానం బిల్డింగ్ ను ఢీకొట్టినప్పుడు, ఆ impact కు ఆ ఎమర్జెన్సీ డోర్ ఊడి పోయుండవచ్చు. ఆ వేగంలో ఈ పాసింజర్ సీట్ విరిగి, సీట్ తో సహ బయటకు విసిరేయబడి ఉండవచ్చు అని అభిప్రాయపడుతున్నారు. అతను అందువలన ఆ భారీ అగ్ని కీలల నుండి తప్పించుకొని ప్రాణాలతో బయటపడి, చిన్న గాయాలతో నడుచుకుంటూ హాస్పిటల్ కు వెళ్లాడు. ఒక సోషియో ఫెంటసీ సినిమాలో హీరో తప్పించుకున్నట్లే ఉంది ఇతని కథ!
నిజంగా మృత్యువు అనేది ఎప్పుడు ఏ సమయంలో ఎలా వస్తుందో తెలియదు. కానీ ఆయుష్షు ఉంటే, అదృష్టం అనేది మన వెంట ఉంటే ఎలాంటి అపాయం నుంచి అయినా తప్పించుకుంటారు అనేది మన పెద్దలు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్న మాట. అది విశ్వాస్ కుమార్ విషయంలో చూస్తే నిజమే అనిపిస్తుంది. తన ప్రమేయం లేకుండానే ఇంతటి భారీ ప్రమాదం నుంచి వెంట్రుక వాసిలో తప్పించుకున్నాడు అంటే అది అంతా భగవంతుడి లీల అని కొందరు అంటున్నారు.