ప్రస్తుతం మనిషి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు. కానీ ఇప్పుడు శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది. పేరుకు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారనే కానీ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఊబకాయం మొదలు మెడ నొప్పి, కండరాల నొప్పులు ఇలా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం వల్ల ఏర్పడుతోన్న ఇబ్బందుల నుంచి బయటపడడానికి రోజుకు 20 నిమిషాలు సమయం కేటాయిస్తే చాలని నిపుణులు చెబుతున్నారు. ఇదేదో ఆషామాషీగా చెబుతున్నది కాదు పరిశోధనలు నిర్వహించిన అనంతరం పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్లో ఈ విషయాలను ప్రచురించారు. రోజుకు కేవలం 20 నిమిషాలు వ్యాయామం చేస్తే చాలు ఈ సమస్యల నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు. నార్వేలోని ఆర్కిటిక్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎడ్వర్డ్ సగెల్వ్ మాట్లాడుతూ.. రోజంతా ఎక్కువ సేపు కూర్చొవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వన్నాయి. అయితే ఇలాంటి వాళ్లు వారానికి కనీసం 150 నిమిషాలు శారీరకంగా కొన్ని పనులు చేయాలి. పని ముగిసిన వెంటనే చురుకుగా నడవాలి, లేదా మెట్లపైకి ఎక్కాలి, అంతేకాకుండా కాసేపు శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి అని తెలిపారు.
ఇక 20 నిమిషాలు కూడా ఒకేసారి కాకుండా పని చేసే సమయంలో మధ్యలో రెండుసార్లు 10 నిమిషాలు కాసేపు నడవాలి. అంతేకాకుండా నడుస్తున్న సమయంలో దూకడం వంటివి చేయాలని పరిశోధకులు చెబుతున్నారు. దీనివల్ల శరీరానికి అవసరమయ్యే వ్యాయామం జరుగుతుందని పేర్కొంటున్నారు. రోజులో 10 నుంచి 12 గంటలు అదే పనిగా కూర్చొని పనిచేసే వారిలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అధ్యయనంలో భాగంగా మొత్తం 12,000 మందిని పరిగణనలోకి తీసుకున్నారు. వీరి కదలికలను గుర్తించేందుకు నాలుగు రోజుల పాటు 10 గంటల చొప్పున ఓ పరికరాన్ని అమర్చారు. వీటి ఆధారంగా వారు ఎంత సేపు లేవకుండా కూర్చుకున్నారో తెలుసుకున్నారు.
ఈ పరిశోధనల్లో తేలిన అంశాల ఆధారంగా.. అధ్యయనంలో పాల్గొన్న సగం మంది ప్రతిరోజూ 10 ½ గంటలు లేదా అంతకంటే ఎక్కువ కదలకుండా ఉన్నట్లు గుర్తించారు. ఇక వివిధ దేశాల్లోని డెత్ రిజిస్ట్రీలతో పాల్గొనేవారి సమాచారాన్ని లింక్ చేసినప్పుడు, సగటున ఐదు సంవత్సరాలలో, 805 మంది లేదా 17% మంది మరణించినట్లు వారు కనుగొన్నారు. మరణించిన వారిలో, 357, లేదా 6% మంది, రోజుకు 10 ½ గంటల కంటే తక్కువ కూర్చున్నట్లు గమనించారు. రోజులో 12 గంటల కంటే ఎక్కువసేపు కూర్చోవడం, ఎనిమిది గంటలతో పోలిస్తే 38% మరణ ప్రమాదంతో ముడిపడి ఉందని పరిశోధకులు కనుగొన్నారు.
ఎక్కువ సమయం కదలకుండా కూర్చోవడం అనేది దీర్ఘకాలంలో పెద్ద సమస్యగా మారుతుందని కొలంబియా వర్సిటీ వాగెలోస్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్లోని బిహేవియరల్ కార్డియాలజీ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నా బెంజమిన్ బౌడ్రియాక్స్ అనే శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు. ఇలాంటి వారు వీలైనంత వరకు నడకను ఆశ్రయించాలని, దగ్గర్లోని దుకాణాలకు, ఇతర పనుల కోసం బయటకు వెళ్లేప్పుడు వీలైనంత వరకు బైక్లను వదిలి నడవాలని చెబుతున్నారు.