పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో కివీస్ జట్టు బోణీ కొట్టింది. ఆతిథ్య పాకిస్థాన్ జట్టుకు షాక్ను ఇచ్చింది. న్యూజిలాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ జట్టు ఎప్పటికప్పుడు వికెట్లను కోల్పోయింది. ఏ దశలోనూ భాగస్వామ్యాలను నెలకొల్పలేదు. దీంతో ఓటమి పాలైంది. పాక్ జట్టుపై కివీస్ 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో గ్రూప్ ఎలో మొదటి స్థానంలో నిలిచింది.
తొలుత టాస్ గెలిచిన ఆతిథ్య పాకిస్థాన్ జట్టు ఫీల్డింగ్ను ఎంచుకోగా న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో టామ్ లాథమ్, విల్ యంగ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. 104 బంతులు ఆడిన లాథమ్ 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 118 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. మరో బ్యాట్స్మన్ విల్ యంగ్ 113 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్తో 107 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మరో బ్యాట్స్మన్ గ్లెన్ ఫిలిప్స్ 39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 61 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. పాక్ బౌలర్లలో హరిస్ రవుఫ్, నసీమ్ షాలు చెరో 2 వికెట్లను పడగొట్టారు. అబ్రార్ అహ్మద్కు ఒక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 47.2 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో బాబర్ ఆజమ్, ఖుష్దిల్ షాలు మినహా ఎవరూ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. 90 బంతులు ఆడిన బాబర్ 6 ఫోర్లు, 1 సిక్సర్తో 64 పరుగులు చేయగా, 49 బంతులు ఆడిన షా 10 ఫోర్లు, 1 సిక్సర్తో 69 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లలో విల్ ఓరూర్కీ, మిచెల్ శాన్టనర్లు చెరో 3 వికెట్లు తీశారు. మ్యాట్ హెన్రీకి 2, మైకేల్ బ్రేస్వెల్, నాథన్ స్మిత్లకు చెరొక వికెట్ దక్కాయి.