ఆధ్యాత్మికం

కొత్త వాహ‌నాల‌కు పూజ‌లు చేసేట‌ప్పుడు మిర‌ప‌, నిమ్మ‌కాయ‌ల‌ను దండ‌గా క‌డతారు ఎందుకో తెలుసా..?

ఎవ‌రైనా ఏ వాహ‌నమైనా కొనుక్కున్న‌ప్పుడు దానికి శాస్త్రోక్తంగా పూజ చేయించే ప‌ద్ధ‌తిని హిందువులు పాటిస్తారు. ఆ మాట కొస్తే సెకండ్ హ్యాండ్ వాహ‌నం కొన్న‌ప్ప‌టికీ అది త‌మ చేతుల్లోకి వ‌చ్చింది మొద‌టి సారే క‌నుక అలాంటి వాహ‌నాల‌కు కూడా పూజ‌లు చేయిస్తారు. వాహ‌న‌దారులు త‌మ ఇష్ట దైవానికి చెందిన ఆల‌యానికి వెళ్లి మ‌రీ ఈ పూజ జ‌రిపిస్తారు. అయితే సాధార‌ణంగా ఎవ‌రైనా హ‌నుమంతుడు లేదా దుర్గా దేవిల ఆల‌యాల‌కు వెళ్లి ఈ పూజ చేస్తారు. ఎందుకంటే వారు దుష్ట‌శ‌క్తుల‌ను త‌రిమే ఉగ్ర దేవ‌త‌లు కదా, అందుక‌నే చాలా మంది అలా చేస్తారు. అయితే వాహ‌నాల‌కు పూజ చేసే స‌మ‌యంలో దానికి నిమ్మ‌కాయ‌లు, మిర‌ప‌కాయ‌ల‌ను క‌లిపి దండ‌గా గుచ్చి ఆ దండ‌ను క‌డ‌తారు. అలా ఎందుకు చేస్తారో తెలుసా..? దాని వెనుక ఉన్న కార‌ణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రహాలలో ఎర్రనిది, ఉగ్రత్వం కలిగినది కుజగ్రహం. కుజుడు ప్రమాద కారకుడని శాస్త్రనమ్మకం. కుజుని ఆదిదైవం హనుమంతుడు. అలాగే గ్రహాల్లో శుక్ర గ్రహానికి చెందిన రుచి పులుపు. అభివృద్ధికి, సంపదకు శుక్రుడు కారకుడు. కారం రవిగ్రహానికి చెందినది. అధికారానికి రవి కారకుడు. వీరు వాహన చోదకుని పట్ల శాంతులై ఉండాలని కోరుతూ వాహనాలకు నిమ్మకాయలు, మిరపకాయలు కడతారు. ల‌క్ష్మీదేవికి తీపి వంట‌కాలు అంటే ఎంత ఇష్ట‌మో ఆమె అక్క అయిన అల‌క్ష్మికి కారం, పులుపు వంట‌కాలంటే అంత ఇష్ట‌మ‌ట‌. అందుక‌ని ఆవిడ‌ను శాంతింప‌జేయ‌డానికి వాహ‌నాల‌కు అలా కారం ఉండే మిర‌ప‌కాయ‌లు, పులుపు ఉండే నిమ్మ‌కాయ‌ల‌ను క‌డ‌తారు. దీంతో ఆవిడ శాంతించి వాహ‌నాల‌కు ఎలాంటి ప్రమాదం క‌ల‌గ‌నీయ‌ద‌ట‌. అందుకనే వాటిని దండ‌లుగా క‌డ‌తారు.

lemon and mirchi garland to vehicles

ఇప్పుడంటే చాలా మంది వాహ‌నాల్లో వేగంగా ఎక్క‌డికంటే అక్క‌డికి ఎన్ని వంద‌ల కిలోమీట‌ర్లు ఉన్నా కొన్ని గంట‌ల్లో చేరుకుంటున్నారు కానీ ఒక‌ప్పుడు అలా కాదుగా. ఎడ్ల బండ్లు, అవి లేక‌పోతే కాలి న‌డ‌కే దిక్కు. అయితే అలా చాలా కాలిన‌డ‌క‌న లేదా ఎడ్ల బండ్ల‌లో సుదీర్ఘ ప్ర‌యాణం చేసే వారు ఎక్కువ‌గా త‌మ వెంట నిమ్మ‌కాయ‌ల‌ను, మిర‌ప‌కాయ‌ల‌ను తీసుకెళ్లేవార‌ట‌. దీంతో నిమ్మ‌కాయ‌ల వ‌ల్ల దాహంగా అనిపించిన‌ప్పుడు ష‌ర్బ‌త్ లాంటివి చేసుకుని తాగేవారు. దీంతో శ‌క్తి వ‌స్తుంది. ఇక విష‌పు కీట‌కాలు కుట్టిన‌ప్పుడు మిర‌ప‌కాయ‌ల‌తో వైద్యం చేసేవార‌ట‌. అందుక‌నే అలా నిమ్మ‌కాయ‌లు, మిర‌ప‌కాయ‌ల‌ను తీసుకెళ్లే ప‌ద్ధ‌తి ఇలా మారింద‌ని చెబుతారు. న‌రుడి దృష్టికి నాప‌రాళ్ల‌యినా ఇట్టే ప‌గులుతాయి, అని అంద‌రికీ తెలిసిందే. అయితే అలా త‌గిలే దిష్టిని హ‌రించేందుకు, వాహ‌నాల‌కు ఎలాంటి ప్ర‌మాదం క‌ల‌గ‌కుండా ఉండేందుకు శాంతిగా అలా మిర‌ప‌, నిమ్మ కాయ‌ల‌ను క‌డ‌తారు.

వాహ‌నాల‌కు ఎలాంటి గాలి సోక‌కండా, దుష్ట శ‌క్తులకు అవి నెల‌వు కాకుండా ఉండేందుకు, వాటిని త‌రిమికొట్టేందుకు గాను అలా నిమ్మ‌కాయ‌లు, మిర‌ప‌కాయ‌ల‌ను క‌డ‌తారు.

Admin

Recent Posts