ఆధ్యాత్మికం

హ‌నుమాన్ చాలీసా గురించిన ఈ 6 ఆస‌క్తిక‌ర విష‌యాలు మీకు తెలుసా..?

హ‌నుమాన్ భ‌క్తులంద‌రూ ఆయన్ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు చ‌దివే మంత్రాల్లో హనుమాన్ చాలీసాకు ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది. హ‌నుమాన్ చాలీసాను చ‌ద‌వ‌డం వ‌ల్ల ఆయ‌న్ను మెప్పించి ఆయ‌న ఆశీస్సులు పొంద‌వ‌చ్చ‌ని భ‌క్తులు విశ్వ‌సిస్తారు. అలాగే శ‌ని ప్ర‌భావం ఉన్న‌వారు హ‌నుమాన్ చాలీసాను చ‌ద‌వ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం పొందుతారు. ఈ క్రమంలోనే ఆ చాలీసాలోని ప్ర‌తి శ్లోకానికి కూడా ఒక అర్థం ఉంటుంది. ఇక హ‌నుమాన్ చాలీసాను చాలా మంది రోజుకు రెండు సార్లు ఉద‌యం, సాయంత్రం వేళల్లో ప‌ఠిస్తారు. అయితే హ‌నుమాన్ చాలీసాకు ఎంత శ‌క్తి ఉందో తెలియజెప్పే 6 కార‌ణాలను కింద ఇవ్వ‌డం జ‌రిగింది. మ‌రి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందామా..!

1. హ‌నుమాన్ చాలీసాను రాసింది…

హ‌నుమాన్ చాలీసాను 15వ శ‌తాబ్దానికి చెందిన క‌వి, స‌న్యాసి గోస్వామి తుల‌సీదాస్ ర‌చించాడు. క్రీస్తు శ‌కం 1560వ సంవ‌త్స‌రంలో అప్ప‌టి మొగ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి జ‌లాలుద్దీన్ మ‌హ‌మ్మ‌ద్ అక్బ‌ర్ తుల‌సీదాసును కారాగారంలో బంధించాడు. ఈ క్రమంలో ఓ వైపు తుల‌సీదాస్ కారాగారంలో ఉంటూనే మ‌రో వైపు హ‌నుమాల్ చాలీసాను ర‌చించాడు. దీంతో హ‌నుమాన్ స్వ‌యంగా ఆశీర్విదిస్తాడ‌ని ఆయ‌న న‌మ్మాడు. ఇక తుల‌సీదాస్ రామునికి కూడా గొప్ప భ‌క్తుడు. కారాగారంలో ఉన్న 40 రోజుల్లో తుల‌సీదాస్ హ‌నుమాన్ చాలీసా ర‌చ‌న‌ను పూర్తి చేశాడు. అప్పుడు అత‌నికి 63 సంవ‌త్స‌రాలు.

do you know about these 6 interesting facts about hanuuman chalisa

2. హ‌నుమాన్ చాలీసాను చ‌దివితే…

హ‌నుమాన్ చాలీసాను రాయ‌డానికి ముందు తుల‌సీ దాస్‌ను అక్బ‌ర్ త‌న స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టి ఏదైనా ఒక అద్భుతం చేసి చూప‌మ‌న్నాడు. అందుకు తుల‌సీదాస్‌.. త‌న‌కేమీ అద్భుతాలు తెలియ‌వ‌ని, త‌న‌కు తెలిసింది శ్రీ‌రాముని స్మ‌ర‌ణ ఒక్క‌టేన‌ని చెబుతాడు. అందుకు కోప‌గించుకున్న అక్బ‌ర్ తుల‌సీదాస్‌ను ఫ‌తేపూర్ సిక్రీ కారాగారంలో ప‌డేస్తాడు. అక్క‌డే 40 రోజుల్లో తుల‌సీదాస్ హ‌నుమాన్ చాలీసాను రాయ‌డం పూర్తి చేస్తాడు. ఇక చివరి రోజైన 40వ రోజున పెద్ద పెద్ద రాక్ష‌స ఆకారంలో అనేక కోతులు ఫ‌తేపూర్ సిక్రీకి వ‌చ్చి నానా భీభ‌త్సం సృష్టిస్తాయి. అక్బ‌ర్ ఇంట్లోనూ అవి చొర‌బ‌డి భీభ‌త్సం చేస్తాయి. దీంతో రాజోద్యోగులు అదంతా శ్రీ‌రాముడి శ‌క్తి అని అక్బ‌ర్‌కు చెబుతారు. దీంతో అక్బ‌ర్ తుల‌సీదాస్ కాళ్ల మీద ప‌డి క్ష‌మాప‌ణ కోరుతాడు.

3. సూర్యునికి, భూమికి మ‌ధ్య దూరం

హ‌నుమాన్ చాలీసా వ‌ల్ల సూర్యునికి, భూమికి మ‌ధ్య ఉన్న దూరం క‌చ్చితంగా తెలుస్తుంద‌ట‌. దీన్ని శాస్త్ర‌వేత్త‌లే చెబుతున్నారు. హ‌నుమాన్ చాలీసాను 15వ శ‌తాబ్దంలో తుల‌సీదాస్ అవ‌ధి అనే భాష‌లో రాశాడ‌ట‌. దాన్ని క్షుణ్ణంగా చ‌దివిన వారు ఈ మాట చెప్పారు. సూర్యునికి, భూమికి మ‌ధ్య ఎంత దూరం ఉందో దాన్ని హ‌నుమాన్ చాలీసాలో గూఢార్థంలో పొందుప‌రిచార‌ట‌.

4. హ‌నుమాన్ చాలీసా ప‌ద్యాలు

హ‌నుమాన్ చాలీసాలో మొత్తం 45 ప‌ద్యాలు ఉంటాయి. 2 దోహాలు, 40 చౌపాయిలు ఉంటాయి. చివ‌ర్లో ఒక దోహా ఉంటుంది. మొదటి దోహాలో శ్రీ అనే అక్ష‌రం ఉంటుంది. ఇది సీత‌ను సూచిస్తుంది. ఇక్క‌డ సీత హ‌నుమాన్‌కు గురువు అని చెప్ప‌బ‌డింది. అలాగే మొద‌టి 10 చౌపాయిల‌లో హ‌నుమాన్ ధైర్యం, జ్ఞానం ఇత‌ర అంశాల గురించి చెప్పారు. 11 నుంచి 20 చౌపాయిల‌లో హ‌నుమంతుడు రాముడు, సీత‌, ల‌క్ష్మ‌ణుడికి చేసిన సేవ‌ల‌ను వివ‌రించారు. 21వ చౌపాయిలో తుల‌సీదాస్ రాముని కృప కోరుకుంటాడు. చివ‌ర్లో హ‌నుమంతున్ని ప్రార్థిస్తాడు. అలాగే రాముడు, సీత‌, ల‌క్ష్మ‌ణుల‌ను త‌నకు ఆశీస్సులు అందించాల‌ని కోరుతాడు.

5. హ‌నుమాన్ చాలీసా శ‌క్తి

జో సైట్ బార్ ప‌ట్ క‌ర్ కోయీ, చుతేహీ బంధీ మ‌హా సుఖ్ హోయీ, జో య‌హే ప‌డే హ‌నుమాన్ చాలీసా, హోయీ సీధీ సా కే గోరేసా

పైన ఇచ్చింది హ‌నుమాన్ చాలీసాలోని ఒక ప‌ద్యం. ఇందులో మొద‌టి లైన్ అర్థం ఏమిటంటే… హనుమాన్ చాలీసా చదివే వారికి ఆయ‌న అనుగ్ర‌హం ల‌భిస్తుంది అని. ఇక రెండో లైన్ అర్థం.. హ‌నుమాన్ చాలీసా చ‌దివే వారికి శివుని క‌రుణ అందుతుంది అని.. అలాగే అనారోగ్యాలు పోవాల‌న్నా హ‌నుమాన్ చాలీసా చ‌దవాల‌ని అందులో రాసి ఉంది.

6. హ‌నుమంతున్ని స్మ‌రించుకోవ‌డం

హ‌నుమంతుడు గొప్ప శ‌క్తి, అమిత‌మైన బ‌లానికి నిద‌ర్శ‌నం. ఆయ‌న్ను స్మ‌రించుకుంటే ఆయ‌న‌లో ఉన్న శ‌క్తి మ‌న‌లోకి ప్ర‌సార‌మ‌వుతుంద‌ట‌. అది మ‌న‌కు ఎంతో మాన‌సిక శ‌క్తిని, ధైర్యాన్ని అందిస్తుంద‌ట‌. అలాగే తుల‌సీదాస్ సూచించిన ప్ర‌కారం ఎవ‌రైతే శ్రీ‌రాముని సేవ‌లో నిత్యం త‌రిస్తారో వారిని హ‌నుమంతుడు ఎల్ల‌వేళ‌లా ర‌క్షిస్తూ ఉంటాడ‌ట‌.

Admin

Recent Posts