ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ లో స్కైస్ట్రైకర్ సూసైడ్ డ్రోన్లను భారత సైన్యం వినియోగించింది. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. ఇండియన్ ఆర్మీ ఇటీవల ఆపరేషన్ సిందూర్ లో తొలిసారి స్కైస్ట్రైకర్ సూసైడ్ డ్రోన్లను వినియోగించింది. ఈ డ్రోన్లు బెంగళూరులోని వెస్టర్న్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో తయారయ్యాయి. భారతదేశానికి చెందిన ఆల్ఫా డిజైన్ , ఇజ్రాయిల్కు చెందిన ఎల్బిట్ సెక్యూరిటీ సిస్టమ్స్ సంయుక్తంగా వీటిని అభివృద్ధి చేశాయి.2021లో భారత సైన్యం అత్యవసరంగా ఈ డ్రోన్ల కోసం 100 యూనిట్ల ఆర్డర్ పెట్టింది. వీటి పరిధి 100 కిలోమీటర్ల వరకూ ఉండి, 5 నుండి 10 కిలోల వార్హెడ్లను తీసుకెళ్లగలవు. ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ ద్వారా నడిచే ఈ డ్రోన్లు శబ్దం తక్కువగా ఉత్పత్తి చేస్తాయి. దాంతో శత్రువులు గుర్తించలేని రీతిలో తక్కువ ఎత్తులో గగనతలంలో సంచరిస్తూ లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
వీటిని లాయిటరింగ్ మ్యూనిషన్స్ అనే పేరుతో పిలుస్తారు. ఇవి లక్ష్యాన్ని ట్రాక్ చేసి, దానిని ధ్వంసం చేసే విధంగా రూపొందించబడ్డాయి. ఆపరేషన్ సిందూర్లో ఈ డ్రోన్లు పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)తో పాటు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడుల్లో కీలక పాత్ర పోషించాయి.ఎల్బిట్ కంపెనీ ప్రకారం, స్కైస్ట్రైకర్ డ్రోన్ సాధారణంగా UAVలా (Unmanned Aerial Vehicle) గగనతలంలో సంచరిస్తూ, అవసరమైన సమయంలో క్షిపణిలా లక్ష్యాన్ని చూసి దాడి చేస్తుంది. ఇవి శత్రువులకు కనిపించకుండా, శబ్దం లేకుండా, అత్యంత ఖచ్చితంగా పని చేస్తాయని సంస్థ పేర్కొంది.
ఈ సాంకేతికత సైనిక వ్యూహాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేపింది. సెన్సర్ టూ షూటర్ వ్యవస్థను బలోపేతం చేస్తూ, మెరుగైన సిట్యుయేషన్ అవేర్నెస్ను సైనికులకు అందిస్తుంది. ఇకపై భారత సైన్యంలో డ్రోన్ల వినియోగం మరింత విస్తృతమయ్యే అవకాశం ఉంది.ఇది భారత్ సైన్యం ఆధునిక యుద్ధ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నదానికి నిదర్శనం.