ప్రార్థించే పెదవులకన్నా దానం చేసే చేతులు మిన్నా అంటుంటారు… దానం ఎందుకు చేయాలి..? దానం ఎప్పుడు చేయాలి.? దానం ఎవరికి చేయాలి? దానం చేయడం వల్ల వచ్చే లాభం ఏంటీ..? అనే ప్రశ్నలెప్పుడైనా మీకు ఎదురైనప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. అపదలో ఉన్న వాళ్ళను ఆదుకోవడం మన సామాజిక బాధ్యత…. కష్టాల్లో ఉన్నప్పుడు కాసింత చేయూతనివ్వడం మన కనీస బాధ్యత… అలాగని మన దగ్గర 10 రూపాయలుంటే ఇంకో పది రూపాయలు అప్పుతీసుకొని మరీ దానం చేయడం వెర్రితనం అవుతుంది. చేసే దానం కూడా …వ్యక్తిని బట్టి, పరిస్థితిని బట్టి చేయాలి. దానాన్ని స్వీకరించే వ్యక్తి అవసరాన్ని గుర్తించి దానం చేయడం ఉత్తమం.
ఏయే దానాల వల్ల ఏయే ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. బియ్యాన్ని దానం చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి. వెండిని దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది. బంగారాన్ని దానం ఇస్తే దోషాలు తొలగిపోతాయి. పండ్లను దానం చేస్తే బుద్ధి వికసిస్తుంది. సంపద కలుగుతుంది. పెరుగును దానం చేయడం వల్ల ఇంద్రియ నిగ్రహం పొందవచ్చు.
నెయ్యిని దానం చేస్తే రోగాలు పోయి ఆరోగ్యంగా ఉంటారు. పాలను దానం చేస్తే నిద్రలేమి తగ్గుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. తేనెను దానం చేయడం వల్ల సంతానం కలుగుతుంది. ఉసిరికాయలను దానం చేస్తే మతిమరుపు తగ్గి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. టెంకాయలను దానం చేస్తే అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. దీపాలను దానం చేయడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. గోవులను దానం చేస్తే రుణ విముక్తులవుతారు. రుషుల ఆశీస్సులు సైతం లభిస్తాయి. అలాగే భూమిని దానం చేస్తే బ్రహ్మ లోక దర్శనం లభిస్తుంది. ఈశ్వరలోక ప్రాప్తి సిద్ధిస్తుంది. వస్త్రాలను దానం చేస్తే ఆయుష్షు పెరుగుతుంది. అన్నదానం చేస్తే పేదరికం పోతుంది. సంపద వృద్ధి చెందుతుంది.
ఇవన్నీ దానం చేస్తూ పోతే మనం ఏమవుతాము అని మాత్రం కామెంట్స్ చేయకండి……..ఇవన్నీ మన వేదాలలో చెప్పబడినవి………వాటిలో మీకు సాధ్యపడేది ఒక్కటైనా చేయమని అర్థం.