కరోనా ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుతుందనుకుంటే ఆ మహమ్మారి రూపం మార్చుకుని మళ్లీ వచ్చి విజృంభిస్తోంది. మొదటగా యూకేలో కొత్త కరోనా స్ట్రెయిన్ కేసులు బయట పడగా ఆ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ క్రమంలోనే అక్కడ మళ్లీ గతంలో మాదిరిగా కోవిడ్ ఆంక్షలను విధించారు. ఇక ఇతర దేశాలు కూడా యూకేకు ప్రయాణాన్ని నిషేధించాయి. భారత్ కూడా విమానాలను నిషేధించింది. అయితే ఇప్పటికే యూకే నుంచి పలువురు భారతీయులు స్వదేశానికి రావడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అలాంటి వారిని ట్రేస్ చేసి వారిని క్వారంటైన్లో ఉంచుతున్నాయి. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్ ను పరీక్షల నిమిత్తం పూణెకు పంపుతున్నారు.
కొత్త కోవిడ్ స్ట్రెయిన్ నిర్దారణ కోసం కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్ ను పూణెకు పంపిస్తున్నారు. అయితే మన దేశంలో కొత్త కోవిడ్ స్ట్రెయిన్ కేసులపై కేంద్రం ఇంకా ప్రకటన చేయాల్సి ఉండగా.. ఇప్పుడు సైంటిస్టులు ఒక కొత్త విషయం చెప్పారు. అదేమిటంటే.. కొత్త కోవిడ్ స్ట్రెయిన్ పాత దాని కన్నా 70 శాతం వేగంగా వ్యాప్తి చెందడంతోపాటు కొత్త కోవిడ్ స్ట్రెయిన్ వల్ల 2021లో పాతదాని కన్నా ఎక్కువ మరణాలు సంభవించే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. అలాగే పాత వైరస్ కన్నా కొత్త స్ట్రెయిన్ వల్ల ఎక్కువ మంది బాధితులు హాస్పిటళ్ల పాలయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.
అయితే కొత్త కోవిడ్ స్ట్రెయిన్కు ఇప్పటికే తయారు చేసిన వ్యాక్సిన్లు పనిచేస్తాయని, అలాగే కొత్త రకం కరోనా వల్ల తీవ్రమైన పరిస్థితులు సంభవించినట్లు ఇప్పటి వరకు ఆధారాలు లేవని సైంటిస్టులు అన్నారు. కానీ కొత్త వైరస్ పట్ల ఇంకా జాగ్రత్తగా ఉండాలని, లేదంటే ఆ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెంది పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు తెలిపారు.