ఆఫీస్లో, వ్యక్తిగత వ్యాపారాల్లో నిమగ్నమై అలసటకు గురవుతుంటాం.. కానీ.. ఎంత అలసిపోయి కూడా అంతరాయం లేకుండా కంటినిండ నిద్ర పోతే శరీరమంతా రీఫ్రేష్ అవుతుందని పెద్దలు చెబుతూ వస్తున్న మాటలను ప్రస్తుతం నిపుణులు సైతం అదే సూచిస్తున్నారు. ప్రశాంతంగా నిద్రపోతే మెరుగైన ఆరోగ్యంతో పాటు మెదడుకి కూడా ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ జరిపిన తాజా పరిశోధనల్లో.. రాత్రి సమయాల్లో సుఖమైన, దీర్ఘమైన నిద్ర మెదడు పనితీరును బాగు చేస్తుందని తేలింది. ప్రశాంతమైన నిద్రతో మెదడులో ఉన్న మలినాలతో పాటు, విషపూరితంగా మారే ప్రోటీన్లు సైతం దూరమై మెదడు చురుకుదనాన్ని సాధిస్తుందని పేర్కొంటున్నారు.
పనులు, ఉద్యోగాలు, వివిధ కారణాలతో ఒత్తిడికి గురై ప్రశాంతతకు కూడిన నిద్ర లేకపోతే నరాల సంబంధిత వ్యాధుల(న్యూరో డీజెనరేటివ్ డిసీజెస్) బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. మలినాలు తొలగిపోవడంతో మెదడు ఆరోగ్యాన్ని రక్షించడంతో పాటు నరాలకు సంబంధించిన వ్యాధులు రాకుండా అడ్డుకోవడం సాధ్యమవుతుంది. ఇలా మెదడు నుంచి మలినాల తొలగింపు మెలకువగా, నిద్రలో ఉన్నప్పుడు కొంత వరకు లో జరుగుతున్న కూడా మంచి, దీర్ఘమైన నిద్ర పోయినప్పుడు మాత్రం సమర్థంగా జరుగుతోందని ఈ పరిశోధనలో కీలక పాత్ర పోషించిన డా. రవి అల్లాడా వెల్లడించారు. మనుషులు, పక్షులు, జంతువులు ఫలాలు, ఆహార పదార్థాలపై వాలుతున్న దోమల్లో నిద్ర అత్యంత ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తున్నట్లు తాజాగా వెలువడిన అధ్యాయనంలో వెలువడింది.
ఉదయం లేవగానే ఫోన్లు, టీవీల ముందు తిష్టవేయకుండ యోగా, వ్యాయామం అవి కుదరకపోతే చిన్నపాటి వాకింగ్ చేయాలి. బెడ్రూమ్, సోఫాల్లో ల్యాప్టాప్ల వినియోగం, టీవీలు, ఫోన్లు, రకరకాల ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం తగ్గించాలి. రాత్రి భోజనం చేసేటప్పుడు మితంగా చేయాలి. నిద్రపోయే మూడు గంటల ముందు ఎక్కువగా తినరాదు. తిన్న వెంటనే నిద్రించేందుకు ప్రయత్నించరాదు. రాత్రులలో నీలం రంగు లైట్లకు దూరంగా ఉంటే మంచిది. పడుకునే ముందు టీ, కాఫీ, చాకెట్లు, మద్యం తీసుకోరాదు.