బెంగళూరులో ఒక మహిళ ఆఫీస్కు వెళ్లేటప్పుడు తనకు ఎదురైన ఒక ఘటన గురించి లింక్డ్ఇన్ ద్వారా షేర్ చేసుకున్నారు. దాంతో ఒక ఇన్ఫోసిస్ ఉద్యోగికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ స్టోరీ వెలుగులోకి రావడమే కాదు… సోషల్ మీడియాలో సొల్లు వీడియోలు చూసుకుంటూ కూర్చొనే వారికి సమయం విలువ కూడా తెలియజెప్పేందుకు ఆ స్టోరీ హెల్ప్ అయింది. చార్మిఖ నాగళ్ల అనే ఒక మహిళ తన పోస్టులో రాసిన కథనం ప్రకారం ఆ డీటేల్స్ ఇలా ఉన్నాయి. తను బుక్ చేసుకున్న బైక్ ట్యాక్సి రైడర్ తన లొకేషన్ కు వచ్చి కాల్ చేశారు. యామ్ ఐ ఆడిబుల్? అని ఒక కార్పొరేట్ ఎంప్లాయి స్టైల్లో మాట్లాడారు. అతడి మాట తీరు, ఉత్సాహం చూసి ఆశ్చర్యం వేసింది. ఆఫీసుకు వెళ్లేటప్పుడు బైక్ పై మాటలు కలిపాను.
అతను ఇన్ఫోసిస్ కంపెనీ కాంట్రాక్ట్ టీమ్ లో పనిచేస్తున్నారని మాట్లాడుతుంటే తెలిసింది. మరి ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తూ ఈ బైక్ ట్యాక్సీ ఏంటని అడిగాను. అందుకు ఆ వ్యక్తి స్పందిస్తూ… వీకెండ్స్ లో సోషల్ మీడియాలో వీడియోలు, పోస్టులు చూస్తూ మొబైల్ స్క్రీన్ స్క్రోల్ చేస్తూ కూర్చోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నా సమయం వృధా కాకుండా ప్రతీ రోజూ ఉదయం, వీకెండ్స్ లో ఇలా బైక్ ట్యాక్సీ నడిపిస్తుంటా. ఆ డబ్బులు ఏదో ఒక ఖర్చుకు పనికొస్తాయి అని సింపుల్ గా సమాధానం ఇచ్చారని చార్మిఖ తన పోస్టులో పేర్కొన్నారు. ఇలా తను రోజూ ఆఫీసుకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు బైక్ ట్యాక్సీ బుక్ చేసుకునే వస్తానని చెబుతూ తనకు ఎదురైన మరో సంఘటన గురించి కూడా చార్మిఖ ఈ పోస్టులో రాశారు.
ఉబర్ రైడ్ బుక్ చేసుకోగా ఒక ఖరీదైన ప్రీమియం బైక్ రైడర్ వచ్చారు. ఆ బైక్, అతడి లగ్జరీ చూస్తే ఆశ్చర్యపోయాను. ఉండబట్టలేక అడిగితే తన స్టోరీ ఏంటో చెప్పారు. ఒక B2B ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పనిచేస్తున్నానని, ఆఫీసు నుండి ఇంటికి వెళ్తూ ఇలా బైక్ ట్యాక్సీ నడిపిస్తున్నట్లు ఆ వ్యక్తి చెప్పారు. ఒంటరిగా వెళ్లే కంటే ఇలా బైక్ ట్యాక్సీ నడిపిస్తే ప్రయాణంలో ఒక కంపెనీ దొరుకుతుంది, అలాగే రైడ్ కూడా పూర్తి అవుతుంది అని ఆ వ్యక్తి చెప్పుకొచ్చారు. ఇలా బెంగళూరు ఎప్పటికప్పుడు తనను ఆశ్చర్యంలో ముంచెత్తుతూనే ఉందని ఛార్మిఖ తన పోస్టులో పేర్కొన్నారు. అంతేకాదు… గతంలో ఒక మైక్రోసాఫ్ట్ ఉద్యోగి వీకెండ్స్లో ఒంటరిగా ఉండలేక ఆటో నడిపిస్తున్నానని చెప్పిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని కూడా ఛార్మిఖ గుర్తుచేసుకుంటూ ఒంటరితనమే ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతోందా అనే సందేహాన్ని వ్యక్తంచేశారు.
ఇలా నిత్యం ఎంతోమంది ఒక పాసివ్ ఇన్కమ్ సోర్స్ కోసం బైక్ ట్యాక్సీలు నడిపిస్తుండటం మీరు కూడా చూసే ఉంటారు కదా. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు తీరిక వేళల్లో లేదా వీకెండ్స్లో బైక్ ట్యాక్సీలు నడుపుకుంటూ తమ విలువైన సమయాన్ని ఆదాయ మార్గంగా మలుచుకుంటున్నారు. తద్వారా ఏవో ఒక ఖర్చులు వెళ్లదీసుకుంటున్నారు. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో ఎంత సంపాదించినా నెలవారీ ఖర్చులకే సరిపోవడం లేదనేది జగమెరిగిన సత్యం. భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగం చేసే కుటుంబాల్లో ఎంతో కొంత ఆర్ధిక వెసులుబాటు ఉంటోంది. కానీ తక్కువ జీతంతో ఒక్కరే ఉద్యోగం చేసే కుటుంబాలను ద్రవ్యోల్బణం తినేస్తోంది.