భారత దేశం దేవాలయాలకు నెలవు. ఇక్కడ సకల చరాచర సృష్టికి కారణ భూతులైన దేవతలను నిత్యం ఆరాదిస్తారు భక్తులు. అయితే హిందూ శాస్త్ర ప్రకారం అందరికి దేవాలయాలు ఉన్నాయి.. కానీ ఒక్క బ్రహ్మకు మాత్రం ఈ భూమి మీద ఆలయాలు కనిపించవు. సర్వ కోటి ప్రాణుల తలరాత రాసే బ్రహ్మకు ఎందుకు దేవాలయాలు లేవు.. కారణం ఏంటి..? బ్రహ్మకు భూలోకంలో పూజలు ఎందుకు జరగవు..? దీనిపై పురాణాలేం చెబుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వం లోకకళ్యాణం కొరకై యజ్ఞం తలపెట్టిన మహర్షులు త్రిమూర్తులలో గొప్పవారెవరో నిర్ణయించమని భృగుమహర్షిని పంపారు. అలా బయలు దేరిన భృగుమహర్షి తొలుత సత్యలోకాన్ని చేరుకుంటాడు . ఆ సమయంలో వేదగానం చేస్తూ బ్రహ్మదేవుడు, ఆయన గాత్రానికి వీణానాదాన్ని అందిస్తూ సరస్వతీ దేవి సంగీతంలో సంలీనులై ఉంటారు.
భృగుమహర్షి రాకను గమనించకుండా వారి ధ్యానంలో ఉండిపోతారు. దాంతో కోపోద్రేక్తుడైన భృగుమహర్షి కలియుగంలో భూమి మీద నీకు పూజలుఉండవని శాపమిచ్చి వెళ్లిపోతాడంట. అందువలనే బ్రహ్మకు భూలోకంలో దేవాలయాలు ఉండవని.. పూజలు కూడా జరగవని చెపుతారు. రాజస్థాన్ లో అజ్మీర్ కు వాయువ్య భాగంలో సుమారు 10 కిలో మీటర్ల దూరం లో పుష్కర్ దగ్గర గాయత్రి గిరి లో ఉన్న శక్తి పీఠం ఇది. దీనినే బ్రహ్మ పుష్కరిణి అని కూడా అంటారు. అమ్మవారి కంఠా భరణం ఇక్కడే పడిందని భక్తుల విశ్వాసం. ఇక్కడి అమ్మవారు గాయత్రీదేవి. నిత్యంహోమాలు, పూజలతో కళకళ లాడుతుంది. ఈ సరస్సు ఒడ్డునే బ్రహ్మ దేవుని ఆలయం ఉంది. ఇదొక్కటే ప్రపంచం మొత్తం మీద బ్రహ్మదేవునికి ఉన్న ఏకైక ఆలయం. మనదేశంలో అతి ముఖ్య తీర్ధరాజంగా ఇది ప్రసిద్ధి చెందింది. అందుకే దీనికి తీర్ధ రాజ్ అనే సార్ధక నామం కలిగింది.
పద్మపురాణంలో వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజలను హింసించటం చూసి తట్టుకోలేక తన చేతిలోని తామర పువ్వునే ఆయుధంగా విసిరి బ్రహ్మ దేవుడు ఆ రాక్షసుడిని సంహరిచాడట. ఆ సందర్భంలో ఆ పువ్వు నుండి మూడు రేకులు రాలి మూడు చోట్ల పడి మూడు సరస్సులుగా ఏర్పడ్డాయి. వాటికే జ్యేష్ట పుష్కర్, మధ్య పుష్కర్, కనిష్ట పుష్కర్ అని పేర్లు . బ్రహ్మ చేతి నుండి జారి పడిన తామర పువ్వు పడిన ప్రదేశం కనుక పుష్కర్ అనే పేరు సార్ధక మైంది. అయితే అక్కడి ప్రజలు చెప్పుకుంటున్నకథ ప్రకారం.. సరస్వతీ దేవి ఎదుటే…. శివుడు, విష్ణువు కలిసి బ్రహ్మకు గాయత్రి అనే అమ్మాయితో వివాహం చేయిస్తారట..దీనిని చూసి తట్టుకోలేని సరస్వతీ దేవీ బ్రహ్మను ముసలి వాడిగా మారిపోమంటు శపిస్తుందట!. పుష్కర్ లో ప్రతి ఏడాదీ ఒంటెల పరుగు పందాలు జరుగుతాయి.