ఏ ముహూర్తంలో ఆ తల్లిదండ్రులు కన్నారో కానీ ..భారతీయ సినీ జగత్తులో ఒక అద్భుతమైన నటుడు ఈ తెలుగు నేలపై జన్మించాడు. కోట్లాది మంది ప్రజలను కష్టాల నుండి..సమస్యల నుండి గట్టేందుకు హాస్యాన్ని పండిస్తున్నాడు..అతడే జగమంత కుటుంబమై అల్లుకుపోయిన కన్నెగంటి బ్రహ్మానందచారి..అలియాస్ బ్రహ్మానందం. నటుడు..మేధావి..పలు భాషల్లో పట్టున్న బహు భాషా కోవిదుడు..వందలాది సినిమాల్లో నటించి రికార్డు సృష్టించిన అరుదైన యాక్టర్. రచయిత..పుస్తకాల ప్రేమికుడు.. శిల్పి, వడ్రంగి, అధ్యాపకుడు, మెంటార్. అప్పటికప్పుడు ఏది చెప్పినా.. ఎంత కష్టమైనా సరే అక్కడ నవ్వులు పూయించగల నైపుణ్యం కలిగిన ఒకే ఒక్క నటుడు ఆయన.
తాత్వికుడు..యోగి..మేధావి..బహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే..ఆయన చరిత్ర ఒక ప్రపంచమంతా..ఆయన జీవితం ఓ లోకమంత. తెలుగు వారి లోగిళ్లలో నవ్వులు పూయించిన మహానటుడు. రేలంగి తర్వాత అంతటి స్టార్ డంను స్వంతం చేసుకున్న ఘనత ఆయనకే చెల్లింది. స్టార్స్గా వెలుగొందుతున్న సమయంలో హీరోలను పక్కన పెట్టి..తానే ప్రధాన రోల్గా సినిమాలను విజయ తీరాలకు తీసుకు వెళ్లిన అరుదైన నటనా చక్రవర్తి. కోట్లాది అభిమానులను స్వంతం చేసుకున్న నటులు, రాజకీయ నాయకులు ..స్వాములు, యోగులకు ఇష్టమైన నటుడు బ్రహ్మానందం. ఆయన పేరు తలుచుకుంటే చాలు ఏదో గమ్మత్తు ఆవహిస్తుంది. అంతులేని రిలీఫ్ దొరుకుతుంది. ఆత్మహత్యల దాకా వెళ్లిన వాళ్లు ఆయన పండించిన నవ్వుతో తిరిగి లైఫ్ను మొదలు పెట్టిన వాళ్లు ఎందరో. మంచి వక్త. అంతకు మించి ప్లేయర్ కూడా. 1956 ఫిబ్రవరి 1న చాగంటి వారి పాలెం గ్రామం గుంటూరు జిల్లాలో జన్మించిన ఈ కన్నెగంటి బ్రహ్మానంద చారికి 69 ఏళ్లు. 40 ఏళ్లకే ముడుతలు పడి..నానా గడ్డి తింటూ..చెప్పలేని రోగాలకు గురైన వారు విస్తు పోయేలా 60 ఏళ్లు దాటినా ఇంకా ఆయన నటిస్తూనే ..నవ్విస్తూనే ఉన్నారు.
తల్లిదండ్రులు నాగలించారి, లక్ష్మీనరసమ్మలు. బ్రహ్మానందం వివిధ భాషల్లో 1000కి పైగా సినిమాలను ఎప్పుడో దాటేశాడు. ప్రపంచంలోని హాస్య నటుల్లో ఇన్ని సినిమాలు పూర్తి చేసిన నటుడు ఇతడొక్కడే. ఇదో రికార్డు. అందుకే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాడు. లెక్కలేనన్ని అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఐదు నందులు, ఫిల్మ్ ఫేర్ అవార్డు, మూడు సైమా పురస్కారాలు అందుకున్నారు. ఇంతగా హాస్యం పండిస్తున్న బ్రహ్మానందంకు 2005లో నాగార్జున యూనివర్శిటీ డాక్టరేట్ను ప్రదానం చేసి తనను తాను గౌరవించుకుంది. ఇంగ్లీష్లో అనర్ఘలంగా మాట్లాడగలడు. తెలుగులో అలవోకగా పద్యాలు చెప్పగలడు. సాహిత్య పిపాసి. మోస్ట్ వాంటెడ్..పాపులర్ కమెడియన్గా పేరొందారు. సత్తెనపల్లి శరభయ్య హైస్కూల్లో విద్యాభ్యాసం. తండ్రి మిత్రుడు ఆంజనేయులు సహకారంతో భీమవరం డి.ఎన్.ఆర్ కాలేజీలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాడు. గుంటూరు పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో ఎంఏలో పట్టా అందుకున్నాడు. అత్తిలిలో తొమ్మిదేళ్లపాటు లెక్చరర్గా పనిచేశాడు..అపుడే సినిమా రంగంలోకి ఎంటరయ్యాడు. అప్పుడే మిమిక్రీ చేయడం, సాంస్కృతిక బృందాలలో పాల్గొనడంతో పేరు తెచ్చుకున్నాడు. 1985లో దూరదర్శన్లో వచ్చిన పకపకలు కార్యక్రమం ద్వారా ఛాన్స్ లభించింది. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. ఆయన ఎక్కడికి వెళ్లినా బ్రహ్మానందాన్ని గుర్తు పట్టేవారు.
ఈ హాస్య నటుడికి మొదటిసారి సినిమాలో అవకాశం ఇచ్చింది..వేజెళ్ల సత్యనారాయణ. నరేశ్ కథానాయకుడిగా నటించిన శ్రీ తాతావతారం అనే చిత్రంలో హీరోకు ఉన్న నలుగురు స్నేహితుల్లో ఒకడిగా నటించాడు.తను పుట్టిన రోజునే ఆ సినిమాలో వేషం వేశాడు. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అహ నా పెళ్లంట..సినిమా బ్రహ్మానందంకు ఎనలేని పేరు తెచ్చింది. ..పాడె మీద పైసలు ఏరుకొనే వెధవా… పోతావ్రా రేయ్… నాశనమై పోతావ్… అంటూ యజమాని పీనాసితనాన్ని బాహాటంగా కక్కలేక తనలోనే అగ్గిబుగ్గైపోతూ ఆక్రోశాన్ని దిగమింగుకొనే అరగుండు పాత్రతో తెలుగు ప్రేక్షకుల దృష్టి అతనిపై పడింది. అరగుండు వెధవా అని కోటతో తిట్టించుకొన్న ఈ పాత్రే బ్రహ్మానందం తన హాస్యనట విశ్వరూపాన్ని ప్రదర్శించేలా చేసింది. జంధ్యాల దర్శకత్వం వహించిన చంటబ్బాయ్ సినిమా నిర్మాణ సమయంలో చిరంజీవికి బ్రహ్మానందాన్ని పరిచయం చేశాడు. పసివాడి ప్రాణం చిత్రంలో చిన్న పాత్ర ఇచ్చాడు. నిర్మాత రామానాయుడు, చిరంజీవిలను జీవితంలో మరిచి పోలేనంటాడు బ్రహ్మానందం. అప్పటి నుంచి నేటి వరకు ఆగలేదు..ఈ నటుడి ప్రస్థానం. ఏడాదికి 35 సినిమాలలో నటిస్తూనే వెళ్లాడు. సినిమాల్లో ఆయన అలవోకగా మాట్లాడిన మాటలు..జనంలోకి వెళ్లాయి. అవి ఊతపదాలుగా మారాయి. వాటిలో ..మోస్ట్ పాపులర్ అయిన డైలాగ్లు ఇవే..
చిత్రం భళారే విచిత్రం సినిమాలో నీ యంకమ్మా..పోకిరిలో ఆలీతో పండుగ చేసుకో..నువ్వు నాకు నచ్చావ్లో రకరకాలుగా వుంది మాస్టారూ.. మనీ మనీ చిత్రంలో హీరోగా నటించిన ఆయన తన ప్రతాపాన్ని చూపించాడు. ఖాన్తో గేమ్స్ ఆడకు..శాల్తీలు లేచి పోతాయి. అని బ్రహ్మి అంటుంటే జనం ఊగి పోయారు. పట్టుకోండి చూద్దాం లో దొరికాడా ఏశెయ్యండి..జఫ్పా..ధర్మచక్రంలో ఇరుకుపాలెం వాళ్లంటే ఎకసెక్కంగా ఉందా..దూకుడులో నా ఫెర్మారెన్స్ మీకు నచ్చితే ఎస్సెమ్మెస్ చేయండి..ఢీ సినిమాలో ..చారి పాత్రను ఇప్పటికీ మరిచి పోలేం..నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారూ ..అంటూ బ్రహ్మానందం తన నటనను పీక్ స్టేజ్ లోకి తీసుకెళ్లాడు. తండ్రికి తగ్గ తనయుడిగా అనిపించుకున్న ఈ అరుదైన నటుడు..శిల్పి కూడా. తండ్రి చదువరి కావడంతో పుస్తకాలు చదవడం హాబీగా మారింది. అహ నా పెళ్లంట చిత్రం లో ప్రదర్శించిన నటనకు 1987లో తొలి నంది పురస్కారాన్ని అందుకున్నారు. మనీ, అనగనగా ఒక రోజు, అన్న, వినోదం చిత్రాలకు కూడా నందులు దక్కాయి. ఐదు కళాసాగర్, తొమ్మిది వంశీ బర్కిలీ, పది సినీ గోయర్స్ అవార్డులు, ఎనిమిది భరతముని పురస్కారాలు అందుకున్నారు. రాజీవ్గాంధీ సద్భావనా అవార్డు. ఆటా (అమెరికా), సింగపూర్, లండన్ డాకర్స్, అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్స్ వారి సత్కారాలు,షోలాపూర్, ఢిల్లీ తెలుగు అకాడమీల నుంచి సన్మానాలు పొందారు.
విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం స్వర్ణ గండ పెండేరాన్ని. పద్మవాహన సంస్థ బంగారు పతకాన్ని , సత్తెనపల్లి ఫ్రెండ్స్ క్లబ్వారు స్వర్ణ హస్త కంకణాన్ని బహూకరించారు. రేలంగి, రాజబాబు, చలం, అల్లు, సుత్తి వీరభద్రరావు పేరిట నెలకొల్పిన పురస్కారాలన్నీ బ్రహ్మానందం కైవసం చేసుకున్న ఘనత ఆయనదే. టీఎస్ఆర్ కాకతీయ కళా పపరిషత్ హాస్య నట బ్రహ్మ పేరుతో సత్కరించింది. ఎన్నో అవార్డులు..రివార్డులు..పురస్కారాలు..సత్కారాలు..సన్మానాలు అందుకున్న ఈ హాస్యనట చక్రవర్తి..ఎక్కని మెట్లు లేవు. అందుకోని ప్రశంసలు లేవు. జీవితం అంటే సక్సెస్ కాదు..కాసింత నవ్వు..ఆ నవ్వుకే కొత్త అర్థం చెప్పి..హాస్యం లేకపోతే లైఫ్కు అర్థం ఏం ఉంటుందని నేర్పిన ఈ అరుదైన నటుడు..ఇలాగే నవ్విస్తూనే ఉండాలి.మనల్ని తడుముతూనే వుండాలి..