పుట్టగొడుగులతో మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కానీ వీటిని ఎలా వండుకుని తినాలో చాలా మందికి తెలియదు. వీటిని ఎలా వండాలి ? అని సందేహాలకు గురవుతుంటారు. అయితే వీటితో మష్రూమ్ మసాలా వండుకుని తినవచ్చు. ఈ కూర ఎంతో రుచిగా ఉంటుంది. మరి దీన్ని ఎలా వండాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
మష్రూమ్ మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
పుట్టగొడుగులు – 200 గ్రాములు, క్యాప్సికమ్ ముక్కలు – 1 కప్పు, టమాటా ముక్కలు – రెండున్నర కప్పులు, ఉల్లిపాయ ముక్కలు – 1 కప్పు, వెల్లుల్లి ముద్ద – 1 టేబుల్ స్పూన్, గరంమసాలా – 1 టీస్పూన్, కసూరి మెంతి – 1 టీస్పూన్, మీగడ – 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తురుము – కొద్దిగా, ధనియాలు – 1 టేబుల్ స్పూన్, ఎండు మిర్చి – 4, నూనె – 2 టేబుల్ స్పూన్లు.
తయారు చేసే విధానం..
బాణలిలో ధనియాలు, ఎండు మిర్చి వేసి వేయించి తీసి చల్లారాక పొడి చేయాలి. నాన్స్టిక్ పాన్లో నూనె వేసి కాగాక ఉల్లి ముక్కలు వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి ముద్ద కూడా వేసి వేగాక ధనియాలు, ఎండు మిర్చి పొడి వేసి ఓ నిమిషం వేయించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన టమాటా ముక్కలు, ఉప్పు వేసి ఉడికించాలి. అవి మెత్తగా ఉడికిన తరువాత క్యాప్సికమ్ ముక్కలు, పుట్ట గొడుగుల ముక్కలు వేసి ఉడికించాలి. పుట్టగొడుగుల్లోని నీళ్లన్నీ ఆవిరైపోయి అవి బాగా ఉడికిన తరువాత గరం మసాలా, కసూరి మెంతి వేసి కలపాలి. చివరిగా కొత్తిమీర తురుము, మీగడ వేసి దించాలి. దీంతో ఘుమఘుమలాడే మష్రూమ్ మసాలా రెడీ అవుతుంది. దీన్ని వేడి వేడి చపాతీలతో తింటే అద్భుతంగా ఉంటుంది.