Dondakaya Masala Gravy Curry : దొండ‌కాయ మ‌సాలా గ్రేవీ క‌ర్రీని ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Dondakaya Masala Gravy Curry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ‌లు కూడా ఒక‌టి. దొండ‌కాయ‌లు కూడా ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దొండ‌కాయల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. దొండ‌కాయ‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. దొండ‌కాయ‌ల‌తో త‌రుచూ వేపుడే కాకుండా వీటితో మ‌సాలా క‌ర్రీని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క‌ర్రీ పాయింట్ ల‌లో ఎక్కువ‌గా ల‌భించే ఈ దొండ‌కాయ మ‌సాలా క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇంట్లో కూడా మ‌నం చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే దొండ‌కాయ మ‌సాలా గ్రేవీ క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

దొండ‌కాయ మ‌సాలా గ్రేవీ క‌ర్రీ తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

దొండ‌కాయ‌లు – పావుకిలో, ప‌సుపు – పావు టీ స్పూన్, నూనె – 4 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, త‌రిగిన ఉల్లిపాయ‌- 1, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, త‌రిగిన ట‌మాట – 1, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నీళ్లు – ఒక క‌ప్పు, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Dondakaya Masala Gravy Curry recipe in telugu make in this method
Dondakaya Masala Gravy Curry

మ‌సాలా పేస్ట్ త‌యారీదొండ‌కాయ మ‌సాలా గ్రేవీ క‌ర్రీ తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌ల్లీలు – ఒక టేబుల్ స్పూన్, ఎండు కొబ్బ‌రి ముక్క‌లు – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క‌, ల‌వంగాలు – 2, యాల‌కులు – 2, ధ‌నియాలు – 2 టీ స్పూన్స్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, మెంతులు – చిటికెడు, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్.

దొండ‌కాయ మ‌సాలా గ్రేవీ క‌ర్రీ తయారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ప‌ల్లీలు, ఎండు కొబ్బ‌రి ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత మిగిలిన ప‌దార్థాల‌ను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. త‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని పొడిగా చేసుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత దొండ‌కాయ‌ల చివ‌ర్ల‌ను తీసేసి గుత్తి వంకాయ మాదిరి నాలుగు ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. ఈ ముక్క‌ల‌పై కొద్దిగా ప‌సుపు, ఉప్పు వేసి ముక్క‌ల‌కు ప‌ట్టేలా క‌లుపుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక దొండ‌కాయ ముక్క‌ల‌ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌రకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే నూనెలో ఆవాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి.

త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌బ‌డే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత కారం, ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత దొండ‌కాయ ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి.ఇప్పుడు మ‌ర‌లా మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత గ‌రం మ‌సాలా వేసి క‌లిపి మ‌రో 2 నిమిషాల పాటు ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దొండకాయ మ‌సాలా గ్రేవీ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. దొండకాయ‌ల‌ను తిన‌ని వారు కూడా ఈ క‌ర్రీని ఇష్టంగా తింటారని చెప్ప‌వ‌చ్చు.

Share
D

Recent Posts