Garlic Masala Curry : బిర్యానీ, రైస్‌, చ‌పాతీ.. ఎందులోకి అయినా స‌రే.. ఇలా మసాలా క‌ర్రీ చేయండి..!

Garlic Masala Curry : వెల్లుల్లి మ‌సాలా క‌ర్రీ.. మ‌నం వంటల్లో వాడే వెల్లుల్లితో చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. చ‌పాతీ, రోటీ, అన్నం, పులావ్, బిర్యానీ ఇలా దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఇలా వెల్లుల్లితో మ‌సాలా కూర‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ కూర‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఒక్క‌సారి దీనిని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కూర కావాలంటారు. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వెల్లుల్లితో ఎంతో రుచిగా ఉండే మ‌సాలా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వెల్లుల్లి మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 3 టేబుల్ స్పూన్స్, సాజీరా – పావు టీ స్పూన్, వెల్లుల్లిపాయ – చిన్న‌ది ఒక‌టి, పుదీనా ఆకులు – కొద్దిగా, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, త‌రిగిన ఉల్లిపాయ – 1, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్ లేదా తగినంత‌, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన ట‌మాటాలు – 2, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – ఒక గ్లాస్, ఉడికించిన బంగాళాదుంప – పెద్ద‌ది ఒక‌టి, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Garlic Masala Curry recipe in telugu make in this method
Garlic Masala Curry

మ‌సాలా పేస్ట్ త‌య‌రీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, ల‌వంగాలు – 4, యాల‌కులు – 2, జాప‌త్రి – కొద్దిగా, ఎండుమిర్చి – 4, మిరియాలు – ఒక టీ స్పూన్, నువ్వులు – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు – 10, అల్లం – ఒక ఇంచు ముక్క‌.

వెల్లుల్లి మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో వెల్లుల్లి, అల్లం త‌ప్ప మిగిలిన మ‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు వేసి దోర‌గా వేయించాలి. త‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని అందులోనే వెల్లుల్లి రెబ్బ‌లు, అల్లం వేసి మెత్త‌గా మిక్సీ పట్టుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత వెల్లుల్లిపాయ‌ను తీసుకుని వెల్లుల్లి రెబ్బ‌ల‌ను చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక సాజీరా వేసి వేయించాలి. త‌రువాత త‌రిగిన వెల్లుల్లి ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత పుదీనా ఆకులు, క‌రివేపాకు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ప‌సుపు, కారం, ఉప్పు వేసి క‌ల‌పాలి.

త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌లపాలి. వీటిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత పెరుగు వేసి క‌లపాలి. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌లిపిన త‌రువాత బంగాళాదుంప‌ను మెత్త‌గా చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి మ‌సాలా కూర త‌యార‌వుతుంది. ఈ కూర‌ను దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts