Jilebi : బ‌య‌ట ల‌భించే వాటిలా జిలేబీల‌ను ఇలా ఎంతో రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు..!

Jilebi : మ‌న‌కు బ‌య‌ట అనేక ర‌కాల తీపి ప‌దార్థాలు ల‌భిస్తూ ఉంటాయి. ఇలా ల‌భించే తీపి ప‌దార్థాల‌లో జిలేబీ కూడా ఒక‌టి. ఇది మ‌నంద‌రికీ తెలిసిందే. దీని రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇది మ‌న‌కు బ‌య‌ట ఎక్కువ‌గా దొరుకుతూ ఉంటుంది. జిలేబీల‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కొద్దిగా ఓపిక ఉండాలే కానీ బ‌య‌ట దొరికే విధంగా ఉండే జిలేబీల‌ను మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. జిలేబీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. వాటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

జిలేబీల‌ త‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు..

మైదా పిండి – ఒక క‌ప్పు, పుల్ల‌ని పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – చిటికెడు, బేకింగ్ సోడా – చిటికెడు, పంచ‌దార – ఒక‌టిన్న‌ర క‌ప్పు, నిమ్మ‌ర‌సం – అర టీ స్పూన్, యాల‌కుల పొడి – అర టీ స్పూన్, నీళ్లు – త‌గిన‌న్ని, ఫుడ్ క‌ల‌ర్ – చిటికెడు, నూనె – డీప్‌ ఫ్రై కి స‌రిప‌డా.

make Jilebi at your home with perfect taste
Jilebi

జిలేబీ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి, ఉప్పు, బేకింగ్ సోడా ను వేసి బాగా క‌లుపుకోవాలి. ఇప్పుడు పెరుగును వేసి క‌లుపుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్ల‌ను పోసుకుంటూ మ‌రీ ప‌లుచ‌గా కాకుండా, మ‌రీ గ‌ట్టిగా కాకుండా ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి. ఇప్పుడు ఫుడ్ క‌ల‌ర్ ను వేసి క‌లిపి మూత పెట్టి 10 నుండి 12 గంట‌ల పాటు పులియ బెట్టాలి. ఇలా పులియ బెట్టిన త‌రువాత మూత తీసి మ‌రోసారి క‌ల‌పాలి. ఇప్పుడు ఒక క‌ళాయిలో లేదా గిన్నెలో పంచ‌దార‌ను వేసి అర క‌ప్పు నీళ్ల‌ను పోసి పంచ‌దార క‌రిగే వ‌ర‌కు తిప్పుతూ ఉండాలి. ఈ పంచ‌దార‌ను లేత పాకం వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులోనే నిమ్మ‌ర‌సం, యాల‌కుల పొడి వేసి క‌ల‌పాలి.

ఇప్పుడు ఒక మందంగా ఉండే పాలిథీన్ క‌వ‌ర్, సాస్ బాటిల్స్ లేదా మందంగా ఉండే వ‌స్త్రాన్ని తీసుకుని అందులో ముందుగా క‌లిపి ఉంచిన పిండి మిశ్ర‌మాన్ని వేసి కోన్ ఆకారంలో ప‌ట్టుకోవాలి. ఇలా కోన్ ఆకారంలో ప‌ట్టుకున్న క‌వ‌ర్ కు లేదా వ‌స్త్రానికి చివ‌ర‌న చిన్న రంధ్రాన్ని చేయాలి. ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. ఈ నూనెను మ‌రీ ఎక్కువ‌గా లేదా మ‌రీ త‌క్కువ‌గా వేడి చేయ‌కూడ‌దు. ఎక్కువ‌గా వేడి చేయ‌డం వ‌ల్ల జిలేబీలు విచ్చుకుపోతాయి. త‌క్కువ‌గా వేడి చేయ‌డం వల్ల జిలేబీలు పొంగ‌వు. క‌నుక మ‌ధ్య‌స్థంగా వేడి చేసి కోన్ ఆకారంలో చుట్టిన పిండి మిశ్ర‌మాన్ని జిలేబిలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న జిలేబీని తిప్పుతూ రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌రకు కాల్చుకుని ముందుగా త‌యారు చేసుకున్న పంచ‌దార మిశ్ర‌మంలో వేసి 20 నుండి 30 సెకన్ల పాటు నాన‌బెట్టి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే జిలేబీలు త‌యార‌వుతాయి. వేడి వేడి గా వీటిని తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది.

Share
D

Recent Posts