మహిళలను వేధించినా, వారిపై అత్యాచారం చేసినా నిందితులు తాము ఆ పని చేయలేదని తప్పించుకుంటుంటారు. ఈ క్రమంలో వారిని దోషులుగా నిరూపించడం కూడా ఒక్కోసారి కష్టసాధ్యమవుతుంది. దీంతో బాధితులకు న్యాయం జరగదు. అయితే ఇలాంటి సందర్భాల్లో దోషులుకు శిక్ష పడేలా చేయవచ్చు. వారు అస్సలు తప్పించుకోలేరు. అవును, మీరు విన్నది నిజమే. అయితే నిందితులకు అలా శిక్ష పడేలా చేయడం కోసం వారు ఆ నేరాన్ని చేశారని 100 శాతం రుజువులు కావాలి కదా, మరి అవి ఎలా..? అంటే.. అవును, అది సాధ్యమే. అలాంటి రుజువులను సృష్టించడం కోసం సైంటిస్టులు అభివృద్ధి చేసిన ఓ కొత్త టెక్నాలజీ పనికొస్తుంది. అదేమిటంటే…
స్లోవేకియాలోని బ్రాటిస్లావాకు చెందిన కామెనియస్ యూనివర్సిటీ పరిశోధకులు గతంలోనే ఓ కొత్త టెక్నాలజీ డెవలప్ చేశారు. దాని సహాయంతో లైంగిక నేరాల్లో నిందితులను దోషులుగా నిరూపించవచ్చు. సదరు పరిశోధకులు టెక్నాలజీని ఎలా కనిపెట్టారంటే… కొందరు జంటలను 2 నిమిషాల పాటు లిప్ టు లిప్ కిస్ పెట్టుకోమని చెప్పారు. అనంతరం వారిలో మహిళల నోట్లో నుంచి ఉమ్మిని సేకరించారు. ముద్దు పెట్టుకున్న తరువాత 5, 10, 30, 60 నిమిషాల వ్యవధిలో మహిళల నోట్లోని ఉమ్మిని సేకరించారు. అనంతరం దాన్ని విశ్లేషించారు.
ముద్దు పెట్టుకున్న మహిళల నోట్లో నుంచి వివిధ సమయాల్లో తీసుకున్న ఉమ్మిని సైంటిస్టులు టెస్ట్ చేశారు. ఆ ఉమ్మి డీఎన్ఏలో ఉండే వై క్రోమోజోమ్లను వెదికారు. అయితే సదరు వై క్రోమోజోమ్లు చాలా సేపు మహిళల నోట్లో ఉన్నట్టు తెలుసుకున్నారు. ఈ వై క్రోమోజోమ్లు పురుషుల్లోనే ఉంటాయి. దీంతో ముద్దు పెట్టుకున్నప్పుడు పురుషుల ఉమ్మి స్త్రీల నోట్లోకి వెళ్తుంది కదా, అందులో వై క్రోమోజోమ్లు ఉంటాయి. అవి ముద్దు పెట్టుకున్నాక చాలా సేపు అలాగే స్త్రీల నోట్లో ఉంటాయి. కనుక వాటిని గుర్తిస్తే చాలు, సదరు స్త్రీపై పురుషుడు దాడి చేశాడా లేడా అన్నది సులభంగా తెలుస్తుంది. దీంతో నిందితున్ని సులభంగా శిక్షించవచ్చు. అయితే ప్రస్తుతం ఈ టెక్నాలజీ టెస్టింగ్ దశలో ఉంది. త్వరలో ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉంది..!