చాలా మంది ఇంట్లో పూజ గదులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు. ఇంట్లో స్థలం లేకపోతే ఈశాన్య మూలగా పూజ గదిని పెట్టుకుంటారు. ఎక్కువగా కిచెన్కు ఆనుకుని లేదా కిచెన్లో పూజ గది ఉంటుంది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా పూజ గదిలో పెట్టే ఫొటోలు, విగ్రహాల విషయంలోనే చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు. ఈ పొరపాట్ల వల్ల అనేక సమస్యలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
పూజగదిలో కొన్ని ఫోటోలు, ప్రతిమలు ఉంటే నష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అవేంటంటే.. శనీశ్వరుడి ఫోటొలను ఇంట్లోని పూజగదిలో వుంచకూడదు. నవగ్రహాల పటాలను, ప్రతిమలను అస్సలు వుంచకూడదు. నటరాజ స్వామి ఫోటోను, ప్రతిమను ఇంట్లో వాడకూడదు. గుండు తీసుకుని వున్న దేవతల ఫోటోలు, కోపంతో చూస్తుండే ఫోటోలు, కాళికాదేవి ఫోటోలు పూజగదిలో అస్సలు పెట్టకూడదు.
కుమారస్వామి తలకు పైగా వేలాయుధం వుండే ఫోటోలు, ప్రతిమలు ఇంట్లో, పూజగదిలో వుంచకూడదు. రుద్రతాండవం చేసే శివుని ఫోటోలు, తపస్సు చేసే ఫోటోలు ఇంట వుంచకూడదు. ఇవే కాకుండా విరిగిన దేవతల ప్రతిమలు వుండకూడదు. పాతబడిన దేవతల ఫోటోలు, చిరిగిన ఫోటోలను వుంచి ఇంట్లో పూజచేయకూడదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.