అతిగా భోజనం చేయడం.. కారం, మసాలాలు అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం.. మాంసం ఎక్కువగా తినడం.. సమయం తప్పించి భోజనం చేయడం.. వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి అజీర్ణ సమస్య వస్తుంటుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక అవస్థలు పడుతుంటారు. దీంతోపాటే కడుపునొప్పి, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం, వికారం వంటి సమస్యలు వస్తాయి. కొందరికి అజీర్ణం వల్ల విరేచనాలు అవుతాయి. అయితే ఈ సమస్యను పలు ఇంటి చిట్కాలను పాటిస్తే తగ్గించుకోవచ్చు. అవేమిటంటే..
1. రోజూ మనం అల్లంను వంటల్లో వేస్తుంటాం. దీంతో వంటకాలకు చక్కని రుచి వస్తుంది. అయితే అజీర్ణ సమస్యను తగ్గించడంలో అల్లం కూడా బాగానే పనిచేస్తుంది. ఒక గ్లాసు మజ్జిగలో 1 టీస్పూన్ అల్లం రసం కలిపి తాగితే అజీర్ణం సమస్య తగ్గుతుంది. రోజుకు ఇలా 2 సార్లు చేయాలి. అవసరం అనుకుంటే అందులో ఒక టీస్పూన్ తేనెను కూడా కలుపుకోవచ్చు. దీంతో జీర్ణాశయం ఆరోగ్యంగా ఉంటుంది.
2. ఆయుర్వేద ప్రకారం తులసిలో అద్భుతమైన ఔషధగుణాలు ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అర కప్పు నీటిలో ఒక టీస్పూన్ తులసి ఆకుల రసం, ఒక టీస్పూన్ తేనె కలిపి తాగితే అజీర్ణం నుంచి బయట పడవచ్చు. ఇలా రోజుకు 2 సార్లు తాగవచ్చు. దీంతో త్వరగా సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
3. అతిగా భోజనం చేయడం వల్ల అజీర్ణం సమస్య వస్తే అందుకు వాము అద్భుతంగా పనిచేస్తుంది. చిటికెడు వాము, సైంధవ లవణం కలిపి నూరి మిశ్రమంలా చేయాలి. దాన్ని తిన్నాక ఒక గ్లాస్ నీటిని తాగాలి. దీంతో గ్యాస్, అసిడిటీ నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది. అలాగే అజీర్ణం సమస్య తగ్గుతుంది.
4. అజీర్ణం సమస్యను తగ్గించేందుకు నిమ్మరసం, తేనెలు అద్భుతంగా పనిచేస్తాయి. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ తేనెలను కలిపి భోజనం చేసిన తరువాత సేవించాలి. ఇలా ఉదయం, సాయంత్రం చేస్తే ఫలితం ఉంటుంది.
5. అజీర్ణం సమస్య నుంచి బయట పడేందుకు పెరుగు కూడా పనిచేస్తుంది. అజీర్తి విరేచనాలు అయ్యేవారు పెరుగును తీసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు, జీలకర్ర కలిపి భోజనం చేశాక తినాలి. దీని వల్ల ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
6. భోజనం చేసిన ప్రతిసారీ 2 టీస్పూన్ల సోంపు గింజలను నమలాలి. లేదా రోజుకు 2 సార్లు సోంపు గింజల నీటిని తాగాలి. దీని వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా జీర్ణాశయంలో ఉండే గ్యాస్ బయటకు పోతుంది. సోంపు గింజల్లో ఉండే ఫెకోన్, ఈస్ట్రగోల్ అనే సమ్మేళనాలు జీర్ణాశయంలోని గ్యాస్ను బయటకు పంపుతాయి. సోంపు గింజలను తినడం వల్ల జీర్ణరసాలు బాగా ఉత్పత్తి అవుతాయి. అజీర్ణం సమస్య నుంచి బయట పడవచ్చు. రోజూ సోంపు గింజలను తినడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి.
7. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ రసాన్ని పూర్తిగా పిండి భోజనం చేసిన అనంతరం 30 నిమిషాలకు తీసుకోవాలి. దీంతో అజీర్ణం తగ్గుతుంది. జీర్ణాశయంలో ఉండే అసౌకర్యం తగ్గుతుంది.
ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం టెలిగ్రామ్లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365