ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కేజీఎఫ్ చాప్టర్-2 ఎలాంటి విధ్వంసాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్ నార్త్ అని తేడా లేకుండా విడుదలైన ప్రతి భాషలో వసూళ్ల వర్షాన్ని కురిపించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2000 కోట్ల మార్కును అధిగమించి రికార్డు సృష్టించింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ చిత్రం సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. కలెక్షన్లలో ఖాన్, కపూర్ లను సైతం వెనక్కి నెట్టి రాఖీ బాయ్ టాప్ ప్లేస్ లో నిలిచాడు. అయితే KGF పేరు వింటే.. ఈ సినిమానే గుర్తుకు వస్తుంది. అసలు KGF చరిత్ర ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
19వ శతాబ్దం నుంచే అక్కడ బంగారం తవ్వకాలు మొదలుపెట్టారు. మన దేశానికి ఉన్న ముఖ్యమైన బంగారు గనిగా KGF (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) పేరుగాంచింది. అయితే అంతటి పేరు ఉన్న గనిని కేంద్రం ఎందుకు మూసివేసింది? బంగారం తవ్వి తీయవచ్చు కదా? అంటే, ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన మైకేల్ 1804వ సంవత్సరంలో ప్రచురితం కాబడ్డ ఓ 4 పేజీల ఆర్టికల్ లో కోలార్ లో బంగారు నిక్షేపాలు ఉన్నాయని చదివాడు. దాంతో 1871 లో ఆయన తన మకాంను బెంగళూరుకు మార్చాడు. ఆ తర్వాత కొంత కాలానికి కోలార్ గనుల్లో బంగారం తవ్వకాలు ప్రారంభించాడు. ఇలా ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం, అక్కడ అభివృద్ధి పేరుతో బంగారాన్ని కొల్లగొట్టే ప్లాన్ వేసింది.
అనుకున్నదే తడవుగా, 1900 వ సంవత్సరంలో అప్పటి ఈ బ్రిటిష్ ప్రభుత్వం కోలార్ లో కావేరి నదిపై జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు మైసూరు మహారాజుకు ఓ ప్రతిపాదన పంపింది. దీనికి ఆయన కూడా ఒప్పుకున్నారు. దీంతో వడి వడిగా పనులు జరిగి విద్యుత్ కేంద్రం ఏర్పాటయింది. మొత్తం 148 కిలోమీటర్ల విద్యుత్తు లైనులను ఏర్పాటు చేశారు. అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత పొడవైన విద్యుత్తు లైన్లు కలిగిన ప్రాంతంగా కోలార్ పేరుగాంచింది. ఇక ఆ పవర్ ప్లాంట్ దేశంలోనే మొదటి పవర్ ప్లాంట్ కాగా, ఆసియాలో రెండోది. కోలార్ ప్రాంతంలోకి విద్యుత్ రావడంతో పగలు, రాత్రి తేడా లేకుండా బంగారాన్ని తవ్వుకున్నారు. కోలార్ ప్రాంతమంతా బ్రిటిష్ వారితో నిండిపోయి చిన్నపాటి ఇంగ్లాండును తలపించేది. ఎటు చూసినా బంగ్లాలే కనిపించేవి. కానీ అక్కడి గనుల్లో పనిచేసే భారతీయులు మాత్రం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లలో దుర్భర పరిస్థితిలో నివాసం ఉండేవారు.
1956 అనంతరం కోలార్ బంగారు గనులు జాతీయం అయ్యి కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లాయి. అప్పటి నుంచి 2001 వరకు ఆ గనులలో తవ్వకాలు కొనసాగాయి. మొత్తం భారత్ లో ఉత్పత్తి అయ్యే బంగారంలో కేవలం ఆ గనుల నుంచే 95% వరకు బంగారం వచ్చేది. కానీ 2001లో ఆ గనులను మూసేశారు. తర్వాత అక్కడ గనులన్నీ భూగర్భ జలాలతో నిండిపోయాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ గనులను ఓపెన్ చేసి బంగారం తవ్వాలని పలువురు కేంద్రాన్ని కోరుతున్నారు. అయితే కోలార్ గనుల్లో బంగారం నిల్వలు ఇంకా ఉన్నప్పటికీ ఆ బంగారాన్ని తవ్వి తీయాలంటే ఆ బంగారం కన్న ఎక్కువ ఖర్చు అవుతుందట. అందుకనే ఆ గనులను అప్పట్లో మూసేశారు. అప్పటినుంచి అక్కడ తవ్వకాలను జరపడం లేదు. అలా 2001 నుంచి ఆ గనులు మూసే ఉన్నాయి. ఆ విధంగా KGF గనుల అధ్యాయం ముగిసింది.