Omicron Test : ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ సైబర్ నేరగాళ్లు మాత్రం కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రజల నుంచి డబ్బులను దోచుకుంటూనే ఉన్నారు. ఇక తాజాగా ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దీన్ని అడ్డం పెట్టుకుని కొందరు నేరగాళ్లు నయా మోసానికి తెరలేపారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న విషయం విదితమే. మన దేశంలోనూ ఈ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. అయితే ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే దగ్గర్లోని సెంటర్కు వెళ్లి లేదా హాస్పిటల్కు వెళ్లి పరీక్ష చేయించుకుంటారు. కానీ వారికి వచ్చింది.. సాధారణ కరోనానా.. లేక ఒమిక్రాన్ వేరియెంటా.. అనేది ఇతర పరీక్షల ద్వారానే తెలుస్తుంది. ప్రభుత్వం ఆ పరీక్షలను నిర్వహిస్తుంది.
అయితే కొందరు నేరగాళ్లు ఈ విషయాన్ని ఆసరగా చేసుకుని ప్రజలకు ఉచిత ఒమిక్రాన్ టెస్టు చేస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారు. వారు ఇచ్చే ఆఫర్లను మెసేజ్లు, మెయిల్స్ రూపంలో పంపిస్తున్నారు. వాటిల్లో ఉన్న లింక్లను క్లిక్ చేసి అందులో వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ వివరాలను ఎంటర్ చేయమని అడుగుతున్నారు. ఈ క్రమంలోనే అవి నిజమే అని నమ్మిన కొందరు అలాగే తమ వివరాలను నమోదు చేస్తున్నారు. తరువాత వారి బ్యాంకు అకౌంట్లలో నిమిషాల వ్యవధిలోనే డబ్బులు కట్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ తరహా మోసాలు పెరిగిపోయాయి.
ఒమిక్రాన్ టెస్టును ఉచితంగా చేస్తామంటూ కొందరు నేరగాళ్లు పెద్ద ఎత్తున స్కామ్లు చేస్తున్నారని.. ప్రజలు అలాంటి వారి నుంచి వచ్చే మెసేజ్లు, మెయిల్స్ కు ఎట్టి పరిస్థితిలోనూ స్పందించకూడదని.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ విషయంలో అలర్ట్గా ఉండాలని సూచించింది. ఎవరైనా ఫిర్యాదు చేయదలిస్తే () అనే వెబ్సైట్లో తమ ఫిర్యాదును నమోదు చేయవచ్చని తెలియజేసింది.