ఒక వ్యాపారి చాలా సంవత్సరాలుగా భవనాలు, ఇతర కట్టడాలు నిర్మించే వృత్తిలో ఉండేవాడు. తనకు సహాయంగా ఒక వ్యక్తిని పర్యవేక్షకుడిగా నియమించుకున్నాడు. దాదాపు పాతిక సంవత్సరాలు ఆ పర్యవేక్షకుడు ఆ వ్యాపారి దగ్గర నమ్మకంగా పనిచేశాడు. ఒకరోజు ఆ వ్యాపారి అతణ్ని పిలిచి ”మనం ఇపుడు ఒక భవంతిని నిర్మించాలి. ఎంత ఖర్చయినా ఫరవాలేదు. ఆ భవనం ‘నభూతో న భవిష్యతి’ అనే రీతిలో అద్భుతంగా ఉండాలి” అన్నాడు. ఆయన నెలనెలా ఇచ్చే జీతం రాళ్ళు తప్ప అతనికి ఏమీ లేదు. అంచేత ఈ భవన నిర్మాణానికి కేటాయించిన చాలా భాగం డబ్బు సొంతం చేసుకుంటాను’ అనుకున్నాడు.
అలా తలచిన ఆ వ్యక్తి ఆ భవనాన్ని చౌకగా దొరికే ముడిసరకులతో నిర్మించి పైకి మాత్రం కళాత్మకంగా ఉండేలా వివిధ నగిషీలతో శిల్పాకృతులతో తీర్చిదిద్దాడు. పైకి అద్భుతంగా కనిపిస్తూ బలహీనంగా తయారైన ఆ భవనాన్ని తన యజమానికి చూపించాడు. యజమాని ఆనందపడుతూ, ”మిత్రమా ఈ భవంతి మహత్తరంగా ఉంది. ఇన్నాళ్లు నమ్మకంగా పనిచేశావు… నేను ఈ వ్యాపారం వదిలి వేరే దేశం వెళ్లిపోతున్నాను. అత్యంత విశ్వాసపాత్రుడిగా ఇన్ని సంవత్సరాలుగా నన్నే అంటిపెట్టుకొని ఉన్న నీకు అపురూపమైన జ్ఞాపికలా మిగిలిపోయే ఒక అద్భుతమైన కానుకను ఇవ్వాలనుకున్నాను. ఈ భవంతి నీకోసమే!” అంటూ భవనాన్ని అప్పగించి వెళ్ళిపోయాడు.
ఆ యజమాని వెళ్ళిన కొద్దిసేపటికి ఆ పర్యవేక్షకుడు కుప్పకూలిపోయాడు. త్వరలో కూలబోయే ఆ భవనంలాగే. మనిషి ధర్మం తప్పకూడదనీ, తుది శ్వాస వరకూ దాన్ని విడిచిపెట్టరాదనీ, అధర్మంగా ‘అర్థాన్ని’ సంపాదించితే అనర్థమే తప్ప ఏ పరమార్థమూ నెరవేరదనీ ఈ కథలోని నీతి.