మన పూర్వీకులు రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీళ్లను తాగేవారన్న విషయం అందరికీ తెలిసిందే. అందువల్లే అన్నేళ్ల పాటు వారు ఎలాంటి రోగాలు లేకుండా ఆరోగ్యంగా జీవించారు. రాగి పాత్రల్లో నీళ్లను నిల్వ ఉంచి తాగడం అనేది కేవలం మన దేశంలో మాత్రమే కాదు, ప్రాచీన ఈజిప్టులోనూ ఉండేది. అయితే రాగి పాత్రల్లో నీళ్లను నిల్వ తాగడం వరకు బాగానే ఉంటుంది. కానీ ఈ నీళ్లను తాగడం ఎంత వరకు ఆరోగ్యకరం, దీంతో మనకు ఎలాంటి దుష్పరిణామాలు అయినా కలుగుతాయా.. అని కొందరు సందేహిస్తుంటారు. ఇందుకు వైద్య నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి పాత్రలలో నీటిని నిల్వ ఉంచి తాగితే మంచిది. రాగి అణువులు నీళ్లలో చేరుతాయి. అలాంటి నీళ్లను తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. అధిక బరువు తగ్గుతారు. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగు పడుతుంది. అయితే రాగి పాత్రలో నీళ్లను నిల్వ ఉంచి తాగడం విషయంలో కొన్ని జాగ్రత్తలను పాటించాలని అంటున్నారు. రాగి పాత్రలలో నీళ్లను రాత్రంతా నిల్వ ఉంచాలి. లేదా కనీసం 6 గంటల పాటు అయినా ఉంచాలి. అప్పుడే రాగి అణువులు నీటిలో చేరుతాయి.
రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీళ్లను రోజుకు 2 లేదా3 గ్లాసులు మాత్రమే తాగాలి. ఎందుకంటే మన శరీరానికి రోజుకు 0.9 గ్రాముల రాగి చాలు. ఆహారం ద్వారా చాలా వరకు రాగి మనకు లభిస్తుంది. కనుక ఒకటి రెండు గ్లాసుల మోతాదులో రాగి నీళ్లను తాగితే మంచిదే. కానీ 3 గ్లాసులకు మించి తాగకూడదు. లేదంటే కాపర్ శరీరంలో అధికంగా చేరుతుంది. ఇది అనారోగ్య సమస్యలను సృష్టిస్తుంది. అలాగే రాగి పాత్రలు త్వరగా మురికి పడుతుంటాయి. కనుక నీళ్లు శుభ్రంగా ఉండాలంటే ఎల్లప్పుడూ ఆ పాత్రలను శుభ్రంగా కడగాలి. ఇలా జాగ్రత్తలను పాటిస్తూ రాగి పాత్రలలో నిల్వ ఉంచిన నీళ్లను తాగవచ్చు. దీంతో ఆరోగ్యకరమైన లాభాలను పొందవచ్చు.