లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మళ్లీ ఫెయిల్ అయ్యాడు. లక్నో వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ తో పంత్ మళ్లీ అత్యల్ప స్కోరును చేసి బౌలర్ కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. రిషబ్ పంత్ను గతేడాది మెగా వేలంలో ఏకంగా రూ.27 కోట్లు వెచ్చించి మరీ లక్నో కొనుగోలు చేసింది. లక్నో జట్టు యజమాని సంజీవ్ గొయెంకా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రిషబ్ పంత్ ఉండడం జట్టుకు ఒక బలమని అన్నారు. అయితే టీమిండియాకు ఆడే మ్యాచ్లలో పంత్ ప్రదర్శన ఫర్వాలేదు. కానీ లక్నో జట్టుకు ఆడిన మ్యాచ్లలో మాత్రం పంత్ దారుణంగా విఫలం అయ్యాడు. గత 13 మ్యాచ్లలో కేవలం 135 పరుగులు మాత్రమే చేసిన పంత్ మరోమారు ఈ మ్యాచ్ లోనూ నిరాశ పరిచాడు.
సన్ రైజర్స్ బౌలర్ ఇషాన్ మలింగా స్లో యార్కర్ వేయగా దాన్ని తప్పుగా అంచనా వేసిన పంత్ షాట్ ఆడేందుకు యత్నించాడు. కానీ వేగం తక్కువగా ఉన్నందున బంతి అక్కడే గాల్లోకి లేచింది. దీంతో బంతిని మలింగా ఒడిసి పట్టుకున్నాడు. అద్భుతమైన క్యాచ్ పట్టాడు. అయితే అప్పటి వరకు మ్యాచ్ను చూస్తున్న లక్నో ఓనర్ సంజీవ్ గొయెంకా పంత్ ఔట్ అవ్వగానే వెంటనే కోపంతో స్టేడియంలోని బాల్కనీ నుంచి బయటకు వెళ్లిపోయారు.
పంత్ దారుణంగా విఫలం అయినందుకు ఆయన తీవ్రంగా మనస్థాపం చెంది ఉంటారని ఆయన ప్రవర్తనను చూస్తే అర్థమవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. రూ.27 కోట్లు పెట్టి తెచ్చుకుంటే బూడిదలో పోసిన పన్నీరు అయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాలంటే లక్నో తన మూడు మ్యాచ్లలోనూ కచ్చితంగా గెలిచి తీరాల్సి ఉంది.