Aloo Bathani Masala Kura : ఆలు బ‌ఠాని మ‌సాలా కూర‌ను ఇలా చేయండి.. చ‌పాతీల్లోకి ఎంతో బాగుంటుంది..!

Aloo Bathani Masala Kura : మ‌నం బంగాళాదుంప‌ల‌తో త‌యారు చేసే రుచిక‌ర‌మైన కూర‌ల‌ల్లో ఆలూ బ‌ఠాణీ కూర కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. చ‌పాతీ, రోటీ, అన్నం వంటి వాటితో తిన‌డానికి ఈ కూర చాలా చ‌క్క‌గా ఉంటుంది. అయితే త‌రుచూ ఒకే పద్ద‌తిలో కాకుండా ఈ కూర‌ను మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. చిక్క‌టి గ్రేవితో మ‌రింత రుచిగా ఈ కూర‌ను మ‌నం త‌యారు చేయ‌వ‌చ్చు. ఈ విధంగా త‌యారు చేసే ఆలూ బ‌ఠాణీ కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మ‌రింత రుచిగా, చూస్తేనే తినాల‌నిపించేలా ఉండే ఈ ఆలూ బ‌ఠాణీ మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ బ‌ఠాణీ మ‌సాలా కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ముక్క‌లుగా క‌ట్ చేసిన బంగాళాదుంప‌లు – 150 గ్రా., ప‌చ్చిబ‌ఠాణీ – 100 గ్రా., నూనె – పావు క‌ప్పు, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన పెద్ద ఉల్లిపాయలు – 2, చిన్నగా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, ట‌మాటాలు – పెద్ద‌వి రెండు, నీళ్లు – 350 ఎమ్ ఎల్, నెయ్యి – 2 టీ స్పూన్స్.

Aloo Bathani Masala Kura recipe in telugu make in this method
Aloo Bathani Masala Kura

ఆలూ బ‌ఠాణీ మ‌సాలా కూర త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడ‌య్యాక అందులో కొద్దిగా ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత బంగాళాదుంప ముక్క‌లు, బ‌ఠాణీ వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించి వ‌డ‌క‌ట్టి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత ట‌మాటాలను ఫ్యూరీలాగా చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర‌, ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ప‌సుపు, ఉప్పు, గ‌రం మ‌సాలా, కారం, జీల‌క‌ర్ర పొడి, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత ట‌మాట ఫ్యూరీ వేసి క‌ల‌పాలి.

దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత ఉడికించిన 4 బంగాళాదుంప ముక్క‌ల‌ను మెత్త‌గా చేసి వేసుకోవాలి. త‌రువాత మిగిలిన బంగాళాదుంప ముక్క‌లను, బ‌ఠాణీల‌ను వేసి క‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి మ‌రో 4 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత నెయ్యి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ బ‌ఠాణీ మ‌సాలా కూర త‌యార‌వుతుంది. దీనిని అన్నం, రోటీ, చ‌పాతీ, పూరీ, పుల్కా ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన ఆలూ బ‌ఠాణీ మ‌సాలా కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts